వనస్థలిపురం : దేశంలోనే వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. వనస్థలిపురం ఏరియా దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 పడకల ప్రత్యేక వార్డు, 12 పడకల ఐసీయూ వార్డు, ఆక్సీజన్ ప్లాంటును ఆయన శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వైద్య రంగంలో ఆదర్శరంగా నిలుస్తుందన్నారు. కరోనా మూడవ దశను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాక్షన్ ప్లాన్ను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు.
ఏరియా దవాఖానలో 120 పడకలుండగా, మరో వంద పడకలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఇన్ఫోసిస్ సంస్థ సహకారంతో ఆక్సీజన్ ప్లాంటును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగరంలోని వివిధ దవాఖానల్లో 1600ల పడకలను అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
యాక్షన్ప్లాన్లో భాగంగా మల్కాజ్గిరి, కొండాపూర్, మలక్పేట గోల్కొండ, గాంధీ ఆస్పత్రుల్లో ఇప్పటకే 792 పడకలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్సీజన్, మందుల కొరత లేకుండా పకడ్భందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆక్సీజన్ రవాణా కోసం 540 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 27 కంటైనర్లను సిద్ధం చేశామన్నారు.
ఆక్సీజన్ ఉత్పత్తి రోజుకు 135 మెట్రిక్ టన్నుల నుంచి 327 మెట్రిక్ టన్నులకు పెంచుకున్నామన్నారు. 21లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు, 10లక్షల పీపీఈ కిట్లు, 40లక్షల ఎన్95 మాస్కులు ఇతర సామాగ్రిని సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని, వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని సూచించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దవాఖానలో లిఫ్టు ఏర్పాటు చేయాలని, ఎక్సరే మిషన్, బేబీ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. త్వరలోనే మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, దయానంద్ గుప్తా, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, బీఎన్రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, జిట్టా రాజశేఖర్రెడ్డి, పద్మానాయక్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి, చింతల రవికుమార్, అనిల్ దరి, టీఆర్ఎస్ యూత్ జిల్లా ఇన్చార్జి మాధవరం నర్సింహారావు, వజీర్ ప్రకాశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.