అన్నపురెడ్డిపల్లి/ అశ్వారావుపేట రూరల్, జనవరి 19 : అన్నదాతల ఆలోచనా ధోరణి మారుతోంది. ఇతర పంటల వైపు వారి దృష్టి మళ్లుతోంది. యాసంగిలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ మోసపూరిత విధానాలు గమనించిన హలధారులు.. అధిక ఆదాయాన్ని అం దించే ఇతర పంటల వైపు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రైతులందరూ వరి పంటకు బదులుగా ఇతర పంటలు సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మార్కెట్లో డిమాం డ్ ఉన్న పంటలను సాగు చేసేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇతర పంటలు పండించాలని, పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వచ్చే పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు చేస్తున్న సూచనలను అన్నదాతలు ఆచరణలో పెడుతున్నారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో ఈ యాసంగి సీజన్లో పెసర, మినుము, పొగాకు, వేరుశనగ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, జనుము, నూనెగింజల పంటల సాగును రైతులు విరివిగా చేపడుతున్నారు. ప్రధానంగా వరి పంటకు ప్రత్యామ్నాయం లేని చోట మాత్రమే రైతులు నార్లు పోశారు. కొన్ని ప్రాంతాల్లో వరి సాగు చేసే భూముల్లోనూ పంటలు వేయకుండానే వదిలేస్తున్నారు. వరి సాగు చేసే నేలల్లో ఇతర పంట సాగు చేసే సౌకర్యాలు లేకపోవడంతో పంట విరామం ఇస్తున్నారు. ఈ మండలంలో గత ఏడాది యాసంగిలో సుమారు 5300 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ యాసంగిలో ఎక్కువ శాతం సుమారు 2300 ఎకరాల్లో సీడ్ వరి మాత్రమే సాగు చేస్తున్నారు.
ఒక ఎకరం.. 76 రకాలు చిరుధాన్యాలు..
అశ్వారావుపేట మండలం పండువారిగూడెం గ్రామానికి చెందిన సీసం రాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆదర్శంగా నిలిచాడు. తన అర ఎకరం పొలంలో 76 రకాల చిరుధాన్యాలు సాగు చేసి విత్తనాన్ని తయారు చేసుకుంటున్నాడు. అంతేగాక నవారా దేశవాళీ వరి సాగు చేసి పలువురు రైతుల విత్తనాలు ఉచితంగా పంపిణీ చేశాడు. సేంద్రియ ఎరువులు, కషాయాలను తయారు చేసుకుని పిచికారీ చేస్తున్నాడు. అదే గ్రామంలో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు తన వద్ద ఉన్న కషాయాలు ఉచితంగా ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడు. సేంద్రియ వ్యవసాయంపై మల్లాయిగూడెం వాటర్ షెడ్ మ్యాక్స్ ఆధ్వర్యంలో వాసన్ అనే ఎన్జీవో సంస్థ సహకారంతో సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ తీసుకున్నాడు. పలు ప్రదేశాలకు తీసుకెళ్లి సేంద్రియ ఎరువులు, కషాయాలు తయారుచేసి చూపించారు. అక్కడ సహచర రైతుల అనుభవాలను తెలుసుకున్నాడు. వాసన్ సంస్థ ప్రతినిధి సతీశ్ ప్రోత్సహించారు. నూతన వ్యవసాయ పనిముట్లు అందజేశారు. పత్తి, వేరుశనగ, మినుము, నవారా వరి పంటలను సేంద్రియ పద్ధతులనే పండించాడు. 76 రకాల చిరుధాన్యాలు మరో వారం రోజుల్లో కోతకు వస్తాయి. ఈ రైతు కుటుంబ సభ్యులు వారంలో రెండు రోజులు చిరుధాన్యాల వంటలు చేసుకుంటారు. ఇతడి భార్య కూడా చిరుధాన్యల వంటల తయారీపై వాసన్ సంస్థ ద్వారా శిక్షణ పొందింది. రాగి లడ్డు, కొర్ర పాయసం, దోశలు, కిచిడి, ఉప్మా తయారు చేయడం నేర్చుకుంది.
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పెట్టబడికి రెట్టింపు ఆదాయం వచ్చే పంటల వైపు మళ్లేలా చైతన్యపరచడంతో అన్నదాతలంతా ఇతర పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. అంతర పంటలు, ఆరుతడి పంటలను సాగు చేస్తున్నారు.
-అనూష, ఏవో, అన్నపురెడ్డిపల్లి
మొక్కజొన్న సాగు చేస్తున్నా..
యాసంగిలో వడ్లు కొనబోమని కేంద్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. నేను ఈ యాసంగిలో వరి పంటకు బదులుగా మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నాను. వరి పంట వేసినా లాభం లేకపోవడంతో పంట మార్పిడి చేయాలని నిర్ణయించుకొన్నాను. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగే మేలు.
-బన్నె చెన్నారావు, రైతు, రాజాపురం, అన్నపురెడ్డిపల్లి
మినుము, పెసర సాగు చేశాను..
మామిడి తోటలో అంతర పంటలుగా మినుము, పెసర వేశాను. నిరుడు మినుము, పెసర సాగు చేసి మంచి లాభాలు పొందాను. ఈ ఏడాది మినుము, పెసర పంటలను సాగు చేశాను. ఇతర పంటల సాగు వల్ల పెట్టుబడి, శ్రమ తగ్గడంతోపాటు లాభాలు ఎక్కువగా పొందొచ్చు.
-భీమిరెడ్డి వెంకటరెడ్డి, రైతు, నర్సాపురం, అన్నపురెడ్డిపల్లి