సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రతి బస్తీలో మెరుగైన మౌళిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసేందుకు కృషి చేస్తున్నట్లు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి చెప్పారు. బోర్డులో నిధుల లేమి కారణంగా అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని తెలిపారు.
ఈ మేరకు ఆదివారం ఒకటో వార్డులోని పెద్దతోకట్టతో పాటు పలు బస్తీల్లో స్థానికులతో కలిసి జక్కుల మహేశ్వర్రెడ్డి పర్యటించారు. ప్రధానంగా డ్రైనేజీ సమస్యతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను జక్కుల దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు.
అనంతరం జక్కుల మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే పెద్దతోకట్ట ప్రాంతంలోని సీసీ రోడ్ల నిర్మాణానికి సుమారు రూ.5లక్షలు మంజూరయ్యాయని, ఆదే విధంగా డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం కంటోన్మెంట్లో అమలయ్యే విధంగా చొరవ తీసుకుంటున్నామని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. బోర్డులో నిధులు లేకపోవడంతో అభివృద్ధి పనులకు మోక్షం కలగడం లేదని, రాష్ట్ర సర్కారు నుంచి రావాల్సి టీపీటీ సర్వీస్ చార్జీల బకాయిలు త్వరలో రానున్న నేపథ్యంలో పెండింగ్ పనులను పూర్తిచేసే విధంగా సీఈఓ అజిత్రెడ్డితో మాట్లాడి సమస్యలను పరిష్కరించే మార్గాన్ని అన్వేషిస్తామని పేర్కొన్నారు.
వార్డులో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి నేరుగా తీసుకువస్తే తక్షణమే సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు విఠల్యాదవ్, రామ్, శ్రీనివాస్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.