ఖమ్మం, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అంతర్ జిల్లాలో వరస చోరీలకు పాల్పడుతూ ప్రజల సొత్తును అపహరిస్తున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం నగరంలోని పోలీస్ కమిషనరేట్లో శుక్రవారం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ వివరాలు వెల్లడించారు. ఖమ్మంలోని ముస్తఫానగర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నటు సమాచారం అందుకున్న వన్ టౌన్, సీసీఎస్ పోలీసులు ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు.
నిందితులను సూర్యాపేట జిల్లాకు చెందిన కాగిత రామచంద్రాపురానికి చెందిన నూకమళ్ల నాగేంద్రబాబు, పప్పుల రాజ్కుమార్ అలియాస్ పండు, బాదే నాగేంద్రబాబు, మండల అశోక్, బాణాల ముత్యాలు, చింతమళ్ల వెంకన్న, కులకులపల్లి మహేశ్, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లేపల్లికి చెందిన తెలగమళ్ల వెంకటేశ్వర్లు అలియాస్ రవిగా గుర్తించారు. వీరంతా జల్సాలకు అలవాటు పడి కొన్నాళ్ల నుంచి అంతర్ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్నారు.
చోరీ చేసిన బంగారు ఆభరణాలను ఖమ్మంలోని గాంధీ చౌక్ ప్రాంతంలోని నగల దుకాణ యజమాని ఎలబోయిన కృష్ణకు విక్రయించేవారు. పోలీసులు దుకాణ యాజమానినీ కేసుల్లో నిందితుడిగా చేర్చారు. దొంగల ముఠా ఖమ్మం నగరంలో 27 ఇండ్లు, సూర్యపేట జిల్లాలో ఒక ఇంట్లో చోరీలకు పాల్పడ్డారు. చోరీ చేసిన సొత్తుతో నూకమళ్ల నాగేంద్రబాబు, పప్పుల రాజ్కుమార్ అలియాస్ పండు గోవా, విశాఖపట్నం ప్రాంతాల్లో పర్యటిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు.
నూకమళ్ల నాగేంద్రబాబు వృత్తి రీత్యా డ్రైవర్. ఖమ్మంలోని ఓ వైద్యుడి వద్ద డ్రైవర్గా పనిచేశాడు. ఈక్రమంలో తన సమీప బంధువు పప్పుల రాజ్కుమార్ అలియాస్ పండుతో కలిసి ఖమ్మంలోని ముస్తఫానగర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. వైద్యుడి వద్ద ఉద్యోగం వదిలేశాడు. బాదే నాగేంద్రబాబు, మండల అశోక్, బాణాల ముత్యాలు, చింతమళ్ల వెంకన్న, కులకులపల్లి మహేశ్, తెలగమళ్ల వెంకటేశ్వర్లు అలియాస్ రవితో కలిసి ముఠాగా ఏర్పడి గడిచిన రెండేళ్లలో ఖమ్మంలో నగరంలో 27 చోరీలు, సూర్యాపేట జిల్లాలో ఒక చోరీకి పాల్పడ్డాడు.
నిందితుల నుంచి పోలీసులు 638 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి, 10 ఎల్ఈడీ టీవీలు, 3 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో బంగారు ఆభరణాలు, వెండి వస్తువుల విలువ సుమారు రూ.40 లక్షల వరకు ఉంటుందని సీపీ తెలిపారు. సమావేశంలో సీసీఎస్ ఏసీపీ టి.రవి, ఖమ్మం నగర ఏసీపీ ఆంజనేయులు, సీసీఎస్ సీఐలు ఎన్.మల్లయ్య స్వామి, నవీన్, వన్ టౌన్ సీఐ చిట్టిబాబు, రెండో పట్టణ సీఐ శ్రీధర్, మూడో పట్టణ సీఐ సర్వయ్య, ఖానాపురం హవేలీ సీఐ రామకృష్ణ, ఎస్సైలు పాల్గొన్నారు.