కారేపల్లి,మే 15: మండల వ్యాప్తంగా రేషన్ బియ్యం వ్యాపారం జోరుగా సాగుతున్నది. నెలకు లక్షల రూపాయల ఆదాయం వస్తుండడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఎటువంటి కష్టం, పెట్టుబడి లేకుండా అధిక లభాలు రావడంతో బంగారు భవిష్యత్ ఉన్న యువకులు సైతం ఈ వ్యాపారంలో భాగస్వాములవుతున్నారు. ఈ కారణంగా నిత్యం చేతిలో డబ్బులు కన్పిస్తుండడంతో చెడు వ్యసనాలకు అలవాటుపడుతున్నారు.
ప్రతీ నెల కారేపల్లి, కామేపల్లి మండలాల నుంచి వందలాది టన్నుల బియ్యాన్ని లారీల ద్వారా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. ప్రతీ నెల మొదటి, రెండు వారాల్లో బియ్యం రవాణా జోరుగా సాగుతున్నది. గ్రామాల్లో కొని నిల్వ ఉంచిన బియ్యం బస్తాలను అర్థరాత్రి దాటిన తర్వాత టాస్క్ఫోర్స్ అధికారులు, పోలీసుల కంట పడకుండా చిన్న వాహనాల ద్వారా ఒక దగ్గరకు చేర్చి లారీల ద్వారా తరలిస్తారు.
వారం రోజుల కిందట ఇల్లెందు-ఖమ్మం ప్రధాన మార్గం గుండా రేషన్ బియ్యంతో వెళుతున్న లారీని ఖమ్మం టాస్క్ఫోర్స్, కారేపల్లి పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో పట్టుకొని కారేపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు. తాజాగా శనివారం అర్థరాత్రి దాటాక బోలేరో వాహనం ద్వారా ఓ యువకుడు విశ్వనాథపల్లి నుంచి రేషన్ బియ్యాన్ని తరలించినట్లు తెలిసింది.