గ్రామంలో ఒక్క పల్లె ప్రకృతి వనం, ఒక్క నర్సరీని చూస్తేనే మనస్సుకు ఆనందం కలుగుతుంది. అందులో ఉన్న మొక్కలు, పచ్చదనం మనిషిని కట్టిపడేస్తాయి.. అటువంటిది మూడు గ్రామాలకు చెందిన పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు ఒకేచోట ఉంటే.. ఆ పచ్చందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఆ ప్రకృతి ఒడిలో కొద్దిసేపు గడిపి వెళ్లాలని మనస్సు ఉవ్విళ్లూరుతుంది.
రాష్ట్రంలోనే ఎక్కడాలేనివిధంగా ఒకేచోట మూడు ప్రకృతి వనాలు, నర్సరీలు లక్ష్మీదేవిపల్లి మండలంలో దర్శనమిస్తున్నాయి. వాటిలో పూలు, పండ్ల మొక్కలతోపాటు ప్రజలు మైమర్చిపోయేలా అన్ని సౌకర్యాలు కల్పించారు. దీంతో లక్ష్మీదేవిపల్లి, సంజయ్నగర్, హమాలీకాలనీ గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
లక్ష్మీదేవిపల్లి, మే 15: గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం సహజం. ఇలా చేసినవి అందరినీ ఆకట్టుకుంటుండగా… ఇక్కడ మాత్రం మూడు పంచాయతీలకు సంబంధించిన నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలను ఒకేచోట ఏర్పాటు చేశారు. ఈ పచ్చందాలను చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు. పూలు, పండ్ల మొక్కలతోపాటు ప్రజలు మైమర్చిపోయేలా అన్ని సౌకర్యాలు కల్పించారు.
సాయంత్రం సమయంలో సేదతీరేందుకు గ్రామస్తులు ఇప్పుడు ఏ పట్టణానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, పచ్చటి ప్రకృతి ఒడిలో కొద్దిసేపు గడిపితే చాలు మనసుకు హాయిగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీ ఉండాలని నిర్ణయించింది. వనాలు ప్రతి గ్రామంలో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మండే ఎండల్లోనూ గ్రామస్తులకు నీడనిస్తున్నాయి. ఒకేచోట మూడు ప్రకృతి వనాలు, నర్సరీలు ఉండడంతో ఆదర్శంగా నిలుస్తున్నాయి ఈ గ్రామ పంచాయతీలు.
రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ, పల్లె ప్రకృతి వనం ఉన్నాయి. అయితే ఇక్కడ మాత్రం మూడు గ్రామ పంచాయతీల పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు ఒకేచోట ఉండడంతో చూసేవారికి కనుల పండువగా ఉంది. లక్ష్మీదేవిపల్లి, సంజయ్నగర్, హమాలీకాలనీ గ్రామ పంచాయతీలు ఒకే దగ్గర వరుసగా ఉంటాయి. లక్ష్మీదేవిపల్లి, సంజయ్నగర్ పక్క పక్కన, హమాలీ కాలనీ వీటికి వెనుకభాగంలో ఉంటుంది. పంచాయతీల హద్దులన్నీ కలిసి ఉంటాయి.
అయితే విడివిడిగా నర్సరీ, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసేందుకు స్థలం దొరకలేదు. దీంతో అధికారులు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ గ్రామ పంచాయతీల సమీపంలో అటవీ భూమి ఉండడంతో ఇక్కడే మూడు పంచాయతీలకు కలిపి నర్సరీ, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో అక్కడే విశాలమైన స్థలంలో నర్సరీ, పల్లె ప్రకృతి వనాలు రూపుదిద్దుకున్నాయి.
ఈ నర్సరీలతోపాటు ప్రకృతి వనాల్లో కేసీఆర్కు అమితంగా ఇష్టమైన మొక్కను ఎక్కువ సంఖ్యలో పెంచుతున్నారు. సహజంగా ప్రతి ఇంటి ముందు ఉండే పసుపు పచ్చ పూల మొక్క అయిన టెకోమో సీఎం కేసీఆర్ ఎక్కువగా ఇష్టపడతారు. ఈ మొక్కను ప్రకృతి వనాల్లో ప్రత్యేకంగా పెంచుతున్నారు. ఇక్కడ కూడా అనేక మొక్కలు పసుపు పచ్చటి పూలతో దర్శనం ఇస్తుంటాయి.
ఈ పల్లె ప్రకృతి వనాల్లో పలు రకాల మొక్కలున్నాయి. అలాగే నర్సరీల్లో మొక్కలను పెంచి వాటిని ఈ ప్రకృతి వనాల్లో నాటారు. ఇక్కడ రంగురంగుల మొక్కలు ఇక్కడికి వచ్చే వారిని ఆహ్వానం పలుకుతున్నాయి. సుమారు మూడు ఎకరాల స్థలంలో ఈ ప్రకృతి వనాలున్నాయి. ఒక్కొక్క పల్లె ప్రకృతి వనంలో సుమారు 2వేల మొక్కల చొప్పున మొత్తం 6 వేల మొక్కలున్నాయి. ఇందులో మందార, కాగితంపూలు, మల్లెపూలు, టెకోమో, గులాబీ, నిద్రగన్నేరు, తంగేడు, ఆకాలిఫా, దానిమ్మ, జామ, నిమ్మతోపాటు మునగ, గుల్మోహర్ తదితర మొక్కలు ఇక్కడ ఉన్నాయి. ఇక షో మొక్కలకు కొదవే లేదు. క్రోటాన్స్ మొక్కలు కూడా ఇక్కడ పెంచుతున్నారు.
మేము ప్రతి రోజు మా పిల్లలతో ఈ ప్రకృతి వనాల వద్దకు వస్తుంటాము. ఇక్కడకు వస్తే ఎంతో హాయిగా ఉంటుంది. రకరకాల మొక్కలను చూస్తూ చాలాసేపు గడుపుతాం. స్వచ్ఛమైన గాలిని పీల్చుకున్నట్లు ఉంటుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో ఇక్కడకు వచ్చి వాకింగ్ చేస్తాం.
– రమ్య, సంజయ్నగర్ పంచాయతీ
పల్లె ప్రకృతి వనానికి వచ్చి ఇక్కడి అందాలను చూస్తే పరవశించి పోవాల్సిందే. గతంలో పార్కుకు వెళ్లాలంటే కొత్తగూడెం వెళ్లాల్సి వచ్చేది. ఉన్న గ్రామంలోనే కొద్దిసేపు గడిపేందుకు ఎప్పుడంటే అప్పుడు వెళ్లేలా ఉంది. ఇక్కడ ఉన్న మొక్కలను చూస్తే ఎంతో బాగుంటుంది.
-దుర్గారాణి, లక్ష్మీదేవిపల్లి
సాయంత్రం సమయాల్లో సేద తీరేందుకు ఇక్కడికి వచ్చే వారికి ఈ ప్రకృతి వనాలు కనువిందు చేస్తున్నాయి. పసుపు, ఎరుపు, నీలం ఇలా రకరకాల పూల మొక్కలు మనసును పరవశింపజేస్తాయి. హాయిగా ప్రకృతి ఒడిలో కొద్దిసేపు గడిపేందుకు ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఇక్కడ ఉంది.
ఉదయం సమయాల్లో గ్రామస్తులు ఇక్కడకు వాకింగ్ కోసం వస్తుంటారు. వారి కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేశారు. అక్కడ కూర్చొని ప్రకృతి అందాలను తిలకించేందుకు బెంచీలను ఏర్పాటు చేశారు. ఎక్కువ విస్తీర్ణంలో మొక్కలు ఉండడంతో ఇక్కడి అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు.