‘రైతులు పండించిన ధాన్యాన్ని కొనిపించలేని కాషాయ నేతలు రాష్ర్టానికి వచ్చి ఏం మేలు చేస్తారు..? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏం ముఖం పెట్టుకుని రాష్ట్రంలో పర్యటిస్తున్నారు? ఎఫ్సీఐ ఏర్పడిన నాటి నుంచి రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది.. మరి ఈ సారి ఎందుకు కొనుగోలు చేయడం లేదు..? ఇది కచ్చితంగా రాజ్యాంగపరమైన హక్కులను కాల రాయడమే. ఏటా వానకాలంలో రా రైస్, వేసవిలో బాయిల్డ్ రైస్ కొంటున్న ఎఫ్సీఐ.. ఈసారి ఎందుకు అడ్డంకులను సృష్టిస్తున్నది..?’ అని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు.
జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఆయన ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లా డారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రైతుల ఆత్మహత్యలు జరిగాయన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు. వరంగల్ డిక్లరేషన్ను అమలు చేయాలని కోరుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీ పాలిత రాష్ర్టాలైన ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ఎందుకు అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర, జడ్పీ చైర్మన్ లింగాల, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల పాల్గొన్నారు.
ఖమ్మం, మే 14: కేంద్రమంత్రి అమిత్షా ఏ మొఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారో చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేని కేంద్ర పెద్దలు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారని ప్రశ్నించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం ఖమ్మం జిల్లాకు వచ్చిన ఆయన.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి ఖమ్మంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఎఫ్సీఐపై ఉందన్నారు.
నూక శాతాన్ని తగ్గించి కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలును సామాజిక బాధ్యతగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చొరవ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు మూలకారణం కాంగ్రెస్ పార్టీయేనని మంత్రి గంగుల స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర రూ.1,960తో ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ను ఛత్తీస్గఢ్లోగానీ, రాజస్తాన్లోగానీ ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్లో కేవలం రూ.1,000కే ఎందుకు ధాన్యాన్ని కొంటున్నారని అన్నారు.
తెలంగాణలో 56 శాతం ఉన్న బీసీలకు ప్రాధాన్యమిచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా 1,25,000 మందికి ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 12 బీసీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాలో 396 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా 374 కేంద్రాలు ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రాష్ట్రంలో 9.32 కోట్ల లక్షల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచామన్నారు. రైతులు సంతోషంగానే ఉన్నారని, ప్రతిపక్ష నాయకులు మాత్రం సంతోషంగా లేరని అన్నారు.
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వికట పరిహాసం చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మండిపడ్డారు. ప్రజల్లో భ్రమలు కల్పించడానికే అమిత్షా, నడ్డా తెలంగాణకు వస్తున్నారని అన్నారు. సభలు, యాత్రల ద్వారా వారి ఆతృతను బయటను పెడుతున్నారని విమర్శించారు. ఆర్బీఐపై కేంద్రం ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకునే అప్పులను అడ్డుకుంటోందని విమర్శించారు. రాష్ర్టానికి కేంద్రం ఇచ్చిన నిధులపై మంత్రి కేటీఆర్ ఓపెన్ చాలెంజ్ చేశారని, కానీ ఇంత వరకూ సమాధానం చెప్పకుండా బీజేపీ నేతలు తోకముడిచారని అన్నారు.
పాదయాత్ర చేస్తూ ఇంటర్ పరీక్షలపై, మంత్రి కేటీఆర్పై ఆరోపణలు చేసిన వారు వాటిని రుజువు చేయకపోతే పరువు నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఐకాన్ అని అన్నారు. టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు వద్దిరాజు రవిచంద్ర, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్ కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు.