ఖమ్మం, మే 14: రైతులు ఇబ్బందులకు గురి కాకూడదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. ప్రతి ధాన్యపు గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని సూచించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులు, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కల్పించిన సౌకర్యాలు వంటి అంశాలపై రెండు జిల్లాల ఉన్నతాధికారులు, రైస్ మిల్లర్లతో ఖమ్మంలో శనివారం నిర్వహించిన సమీక్షకు వారు హాజరయ్యారు.
తొలుత మంత్రి గంగుల మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయానికి పుట్టినిల్లని, వరితోపాటు పత్తి, మొక్కజొన్న, ఆయిల్పాం వంటి పంటలు ఇక్కడ విరివిగా సాగవుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి పెద్దపీట వేసినందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాబోయే 45 రోజులు అధికారులు సమన్వయంతో కొనుగోలు ప్రక్రియను నిర్వహించాలని, తరుగు సమస్య రావద్దని సూచించారు.
మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతోందన్నారు. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో 36,171 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ తమ జిల్లాలో ఇప్పటి వరకు 8,043 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు కురాకుల నాగభూషణం, రాయల శేషగిరిరావు, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఎన్వీ, అదనపు కలెక్టర్లు మదుసూదన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.