హుజూరాబాద్ రూరల్, మే13: పోటీ పరీక్షల కోసం నిర్వహిస్తున్న ఉచిత శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి సూచించారు. పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో పాడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రూప్-1, 2, 4తో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో 90 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఇన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదని ఎద్దేవా చేశాడు. 500 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేసిన సీఎం కేసీఆర్కు యువత రుణపడి ఉంటారని పేర్కొన్నారు. పాడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇస్తున్న ఉచిత కోచింగ్కు ఇప్పటికే 750 మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. ఎంత మంది వచ్చినా ఉచితంగా స్టడీ మెటీరియల్, సదుపాయాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర పట్టణాల్లో నిర్వహించే కోచింగ్ సెంటర్లను తలపించేలా హుజూరాబాద్లో కోచింగ్ సెంటర్ ఉంటుందని స్పష్టం చేశారు. 18 ఏళ్ల అనుభవం ఉన్న వికాస్ అకాడమీ ఫ్యాకల్టీతో కోచింగ్ ఇప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. యువత పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలని కోరారు. అవసరమైతే హుజూరాబాద్తో పాటు జమ్మికుంటలో కూడా మరో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే అత్యధిక ఉద్యోగాలు సాధించాలని యువతకు పిలుపునిచ్చారు. వికాస్ అకాడమీ చైర్మన్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, కౌన్సిలర్లు రమాదేవి, సదానందం, తాళ్లపల్లి శ్రీనివాస్, ముక్క రమేశ్, కిషన్, జడ్పీటీసీ శ్రీరాం శ్యాం, నాయకులు పూర్ణచందర్, నరేశ్, సాధవరెడ్డి, తిరుపతిరెడ్డి, యువతీయువకులు పాల్గొన్నారు.
గతంలో తెలంగాణ ప్రభుత్వం వీఆర్వో, వీఆర్ఏ నోటిఫికేషన్ వేసినప్పుడు పరీక్ష రాసి వీఆర్ఏ ఉద్యోగం సాధించిన. తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఉద్యోగాల ప్రకటన చేయడంతో సంతోష పడిన. ఎలాగైనే కోచింగ్ పోయి గ్రూప్-1 సాధించాలని అనుకున్న. కాని, మా ఇంటి పరిస్థితి చూస్తే బాగాలేదు. ఇంతలోనే పాడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హుజూరాబాద్లో ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తున్నారని తెలువడంతో చాలా సంతోషం అనిపించింది. శిక్షణను సద్వినియోగం చేసుకొని గ్రూప్-1 సాధిస్తా.
-రమాదేవి, హుజూరాబాద్
పాడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు కోసం సన్నద్ధమవుతున్న వారికి ఉచితంగా కోచింగ్ ఇవ్వడం శుభపరిమాణం. దీనిని యువత సద్వినియోగం చేసుకోవాలి. ప్రణాళికతో చదివి ఉద్యోగం సాధించాలి. గతంలో తాము కోచింగ్ తీసుకుంటే చాలా ఖర్చు వచ్చేది. అరకొర సౌకర్యాలతో జంట నగరాల్లో ఉంటూ చాలా ఇబ్బందులు పడ్డాం.
-శ్రీనివాస్, టౌన్ సీఐ, హుజూరాబాద్
ఇటీవల డిగ్రీ పూర్తి చేసిన. మొదటిసారి పోటీ పరీక్షలకు ప్రిపేపర్ అవుతున్న. కోచింగ్ సెంటర్లో నిపుణులు చెప్పిన విషయాలను శ్రద్ధగా విని, ప్రణాళికా ప్రకారం చదువుతా. గ్రూప్-1 సాధించాలనే పట్టుదలతో చదువుతున్న. ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తున్న సీఎం కేసీఆర్ సారుకు, ఉచిత శిక్షణ ఇస్తున్న పాడి ఫౌండేషన్కు రుణపడి ఉంట.
– కృపారాణి, హుజూరాబాద్
నేను ప్రస్తుతం ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న. గ్రూప్-2 కోసం ప్రిపేర్ అవుతున్న. గతంలో కరీంనగర్, వరంగల్ జిల్లా కేంద్రాలకు వెళ్లి డబ్బులు చెల్లించి కోచింగ్ తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడిన. మా అదృష్టం కొద్ది పట్టణంలో పాడి ఫౌండేషన్ వారు ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించిన్రు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డికి రుణపడి ఉంటా.
-ప్రవీణ్, హుజూరాబాద్