పేరు ఒకరిది నిర్వహణ మరొకరిది
28 రోజుల్లో 8 కేసులు,
177.40 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం
కేసులతో సరిపెడుతున్న అధికారులు
అయినా ఆగని అక్రమ రవాణా
రేషన్ బియ్యం సేకరించి బ్లాక్ మార్కెట్కు తరలించి కొందరు
సొమ్ము చేసుకుంటున్నారు. వివిధ గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి కొందరు వ్యాపారులు నేరుగా కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత గుట్టుచప్పుడు
కాకుండా కర్ణాటక తరలిస్తున్నారు. 28 రోజుల్లో ఎనిమిది కేసులు నమోదు చేసిన అధికారులు 177.40 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంటే ఈ దందా ఏ స్థాయిలో జరుగుతుందో ఇట్టే అర్థమవుతున్నది.
అధికారులు దాడులు చేస్తున్నా.. బియ్యం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు.
బ్లాక్ మార్కెట్కు పేదల బియ్యం
గద్వాల, సెప్టెంబర్ 3 : పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రేషన్ బియ్యం సరఫరా చేస్తుంటే.. అధికారుల సహకారంతో ఆ బియ్యం పక్కదారి పడుతున్నది. రూపాయికి కిలో బియ్యం పథకం కొందరు రేషన్ డీలర్లకు కాసులు కురిపిస్తున్నది. దుకాణాలను మరొకరికి బినామీగా ఇచ్చి అక్రమ దందాకు తెరతీశారు. రేషన్ బియ్యం సరిహద్దులు దాటుతున్నా పట్టించుకునే వారు లేరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ దుకాణాల నుంచి బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి ఇతర ప్రాంతాలకు రాత్రి వేళల్లో తరలిస్తున్నారు. దీంతోపాటు రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికే విక్రయిస్తున్నారు. కొంతమంది మిల్లు వ్యాపారులు రేషన్ డీలర్లతో కుమ్మక్కై ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారు. పేదల బియ్యం పక్కదారిలో డీలర్ల పాత్ర చాలా ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. వారం కిందట జిల్లాలోని ఒక వ్యక్తి ఇంట్లో రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పక్కదారి పడుతున్న బియ్యం..
జోగుళాంబ గద్వాల జిల్లాలో మొత్తం 333 చౌకధర దుకాణాలుండగా, 1,60,699 రేషన్ కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతి నెలా 4,100 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. అయితే, లబ్ధిదారులు 2,813 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే తీసుకుంటున్నట్లు సమాచారం. మిగతా బియ్యం పక్కదారి పడుతున్నది. లబ్ధిదారులతోపాటు డీలర్ల నుంచి దళారులు బియ్యాన్ని సేకరిస్తున్నారు. కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేసి.. వాటిని మిల్లర్లకు రూ.12 నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. మిల్లర్లు వీటిని రీసైక్లింగ్ చేసి ఎఫ్సీఐకు సరఫరా చేస్తున్నారు.
బినామీ డీలర్ల ‘కీ’రోల్..
బినామీ డీలర్లు కీ రోల్ పోషిస్తున్నారు. రెండు, మూడేండ్లల్లో జిల్లాలో అవినీతి ఆరోపణ ఎదుర్కొంటున్న సుమారు 50 మంది డీలర్లను అధికారులు తొలగించారు. అయితే, ఖా ళీ స్థానాల్లో వెంటనే కొత్త డీలర్లను ఆర్డీవో నియమించాల్సి ఉంటుంది. కానీ, అలా జరగడం లేదు. అధికారంలో ఉన్న పార్టీ.. ఇతర పార్టీలకు చెందిన డీలర్లను తొలగిస్తున్నారన్న ఆరోపణలతో ఈ విషయాన్ని కొందరు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఒకరిని నియమించిన స్థానంలో కొత్త వారిని తీసుకోవద్దని తీర్పు ఇచ్చింది. సమీపంలోని డీలర్లకు బాధ్యతలు అప్పగించాలని సూచించింది. ఆదే అదునుగా భావించిన అ ధికారులు ఒక్కొక్కరికీ రెండు నుంచి మూడు దుకాణాలు కట్టబెట్టారు. ఇన్చార్జి తీసుకున్న వారు తమకు నచ్చిన వారికి బినామీలుగా పెట్టుకోవడంతో నిర్వహణ ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నది. ఉన్నతాధికారులు స్పందించి పేదల బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
నెలలో 8 కేసులు..
గత నెల ఒకటో తేదీ నుంచి 28వ తేదీ వరకు గద్వాల, గ ట్టు, కేటీదొడ్డి, ఇటిక్యాల, అలంపూర్ మండలాల్లో టాస్క్ఫో ర్స్ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని సివిల్ సైప్లె అధికారులకు అప్పగించారు. 125 క్వింటాళ్ల బియ్యాన్ని పో లీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా పోలీసులతోపాటు సి విల్ సైప్లె అధికారులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. అయితే సివిల్ సైప్లె అధికారులు గత నెలలో ఎనిమిది 6ఏ కేసులు నమోదు చేశారు. కేవలం కేసుల వరకే ఉండడంతో డీలర్లు మళ్లీ దందాను యథావిధిగా కొనసాగిస్తున్నారు.
పేరు ఒకరిది.. నిర్వహణ మరొకరిది..
రేషన్ దుకాణాల నిర్వహణ ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నది. పేరు ఒకరిదైతే.. మరొకరు నిర్వహణ చేస్తూ రేషన్ బియ్యాన్ని పక్కదారి ప ట్టిస్తున్నారు. వారం రోజుల కిందట పట్టుబడిన బియ్యమే ఇందుకు ఉదాహరణ. జిల్లా కేంద్రంలోని రాజవీధిలో 31వ దుకాణం వెంకటేశ్శెట్టి పేరు మీద ఉన్నది. 32వ దుకాణం అశోక్ పేరు మీద ఉంది. అయితే, ఈ రెండు దుకాణాలను నరేందర్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. 31వ దు కాణం వెనుక భాగంలో అక్రమంగా రేషన్ బి య్యం నిల్వ ఉంచారనే సమాచారంతో పోలీసు లు దాడులు చేసి, 31 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని సివిల్ సైప్లె అధికారులకు అప్పగించారు. తాజాగా, అలంపూర్లోని శ్రీ జోగుళాంబ రైస్ మిల్లులో 52.40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశా రు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ దుకా ణం దక్కించుకున్న డీలర్ను వివిధ కారణాలతో తొలగిస్తే ఇన్చార్జిలు మాత్రమే సరుకులు పంపి ణీ చేయాలి. అలా కాకుండా బినామీలు పంపి ణీ చేస్తూ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. దీనికితోడు డీలర్లకు మాత్రమే తెలియాల్సిన ఈ-పాస్ మిషన్ల కీ రెవెన్యూ అధికారుల నిర్ల క్ష్యం కారణంగా బినామీల చేతుల్లోకి వెళ్లాయి. దీంతో ఇష్టానుసారంగా బియ్యం సరఫరా అవుతున్నది. రేషన్ దుకాణాలపై పర్యవేక్షణ లేకపోవడంతో బినామీలు వారికి తోచినట్లుగా వ్యవహరిస్తున్నారు. డీలర్ల వద్ద మిగిలిన బియ్యాన్ని డీలర్ నుంచి దళారులకు.. అటు నుంచి రైస్ మిల్లులకు చేరి రీసైక్లింగ్ తర్వాత ఎఫ్సీఐ గోదాంలకు వెళ్తున్నాయని తెలుస్తున్నది.
దందాకు అడ్డుకట్ట వేస్తాం..
జిల్లాలో పీడీఎస్ రేషన్ బియ్యం దందా జోరుగా కొనసాగుతున్నట్లు దృష్టికి వచ్చింది. త్వరలో అక్రమ రేషన్ బియ్యం దందాకు అడ్డుకట్ట వేస్తాం. జిల్లా కేంద్రంలోని 31వ దుకాణం వెనుక భాగంలో రేషన్ బియ్యం లభ్యమయ్యాయి. డీలర్పై కేసు నమోదు చేశాం. ఎవరైనా రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించొద్దు. డీలర్లు ఎవరి దుకాణాన్ని వారే నిర్వహించాలి. ఇతరుల ద్వారా బియ్యం సరఫరా చేస్తే చర్యలు తీసుకుంటాం.