ఆర్కేపురం : మాతృ భూమి పరిరక్షణలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న మన సైనిక సోదరులకు బాసటగా సైనిక విజయ స్వర్ణోత్సవ కార్యక్రమం జరుపుకోవడం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి అన్నారు.
ఆదివారం ఆర్కేపురం డివిజన్ చిత్రలేఅవుట్ కాలనీలోని వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో 1971 భారత పాకిస్తాన్ యద్దంలో మనదేశం సాధించిన విజయానికి గుర్తుగా విజయ్ దివాస్ 50 ఏళ్ల పండుగ ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధుసూదనచారి మాట్లాడుతూ ఇది ఒక యజ్ఞ తుల్య కార్యక్రమని, ముఖ్యంగా యువతను సైన్యంలో చేరేలా ప్రోత్సహించాలన్నారు. దేశ భద్రత మన ప్రథమ కర్తవ్యం కావాలన్నారు.
విశిష్ట అతిథిగా హాజరైన భారత సైన్యం మాజీ ఉప సైన్యాధిపతి లెప్టినెంట్ జనరల్ కే.రామచంద్రరావు మాట్లాడుతూ లాద్దర్, కార్గిల్, సియాచిన్ గ్లేసియర్లాంటి మంచు కొండల్లో మన సైనిక సోదరులు బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆకృతి దేశ భక్తికి వందనమన్నారు.
గరికిపాటి ప్రసంగంతో ప్రాంగణం చప్పట్లతో మారు మోగింది. ఆకృతి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నటి రోజా రమణి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఏ.జగదీష్చంద్ర, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.