మియాపూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ వేడుకలకు కానుకల ద్వారా ప్రోత్సాహాన్నందిస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. సర్వమత సమానత్వమే మా ప్రభుత్వం అభిమతమని ఆయన స్పష్టం చేశారు.
శేరిలింగంపల్లి నియోజవకర్గం వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని ఆర్పీ కాలనీ బాప్టిస్ట్ చర్చీలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా కార్పొరేటర్ మాధవరం రోజాదేవితో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ క్రిస్మస్ కానుకగా బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తండ్రిలా అండగా నిలుస్తున్నారన్నారు.
అన్ని మతాల పండుగలకు ప్రాధాన్యతనివ్వటం ద్వారా ప్రజలంతా సోదర భావంతో ముందుకు సాగేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. క్రిస్మస్ వేడుకలను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని విప్ ఆరెకపూడి గాంధీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీకార్పొరేటర్ రంగారావు, పార్టీ నేతలు సంజీవరెడ్డి, మోజెస్, మధు, పాస్టర్లు పాల్గొన్నారు.