మియాపూర్ : నియోజకవర్గంలోని కాలనీలన్నింటా మౌలిక వసతులను కల్పించి అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నెలకొన్నా ప్రజా సంక్షేమాన్ని తమ ప్రభుత్వం ముందుకు కొనసాగిస్తున్నదన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి డివిజన్ దీనబంధుకాలనీ, పాపిరెడ్డి కాలనీ, ప్రగతీనగర్ కాలనీల్లో రూ. 40 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాసరావులతో కలిసి విప్ గాంధీ గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల తోడ్పాటుతో అధిక నిధులను మంజూరు చేయిస్తూ డైనేజీ, రహదారులు, తాగునీరు, మెరుగైన విద్యుత్ వంటి సౌకర్యాలను అన్ని డివిజన్లలో కల్పిస్తున్నామన్నారు. అభివృద్ధిలో ప్రతి డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు నడుస్తున్నట్లు విప్ గాంధీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు లక్ష్మీనారాయణ,కనకరెడ్డి, చంద్రారెడ్డి, ఎల్లంనాయుడు,ఇబ్రహీం, శ్రీధర్రెడ్డి,మహేందర్, తిరుపతి,జయమ్మ,సరిత, వెంకటేశ్,అంజి తదితరులు పాల్గొన్నారు.