మన్సూరాబాద్ : సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబమైన పండుగల ఆవశ్యకతను యువతకు తెలియజేసే విధంగా కాలనీల సంక్షేమ సంఘాలు కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
మన్సూరాబాద్ డివిజన్ హయత్నగర్ పరిధి శివంహిల్స్కాలనీలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదివారం యువతులు, మహిళల కోసం ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు వేసిన ముగ్గులను ఆయన తిలకించి పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ శివంహిల్స్కాలనీలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమలోని నైపుణ్యాన్ని ప్రదర్శించారని తెలిపారు. కాలనీవాసుల భద్రతకు అవసరమైన సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రత్యేక నిధులు కేటాయించామని ఆయన తెలిపారు.
కాలనీలో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్తాయిలో మౌళిక వసతులు కల్పిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్రెడ్డి, కొప్పుల లత, కాలనీ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.