అమీన్పూర్, జనవరి 20 : ఎంతకష్టమొచ్చిందో ఏమో తెలియదు కాని ఆ దంపతులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ఉన్నత విద్యావంతులే. భర్త ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా జాబ్ చేస్తుండగా, భార్య ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నది. వారికి అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఏడేండ్ల కూతురు ఉంది. కానీ, వారిని ఏ సమస్యలు చుట్టుముట్టాయే, లేక ఏమి ఇబ్బందులు వేధిస్తున్నాయే తెలియదు. కానీ, ఈ విపత్కర పరిస్థితుల్లో ఆ కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడింది. హృదయ విదారక ఈ ఘటన అందరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నది. వారి తల్లిదండ్రులకు తీరని దు:ఖాన్ని మిగిల్చింది. దంపతులతో పాటు వారి కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా పోతాయిపల్లి గ్రామానికి చెందిన బాలరాజు గౌడ్, సత్యమ్మల కుమారుడు శ్రీకాంత్ గౌడ్ (42), ఆల్వాల్ వెంకటాపూర్కు చెందిన అనామిక (40) పదేండ్ల కిందట ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వీరిరువురు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి స్నిగ్ధ (7) అనే కుమార్తె ఉంది. కాగా, శ్రీకాంత్ గౌడ్ హైదరాబాద్లోని టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అనామిక స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ పాఠశాలలో టీచర్గా విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలోనే వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయో తెలియదు కానీ ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల నుంచి వారు ఎలాంటి ఫోన్ కాల్స్కు స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన అనామిక తండ్రి శ్రీరామచంద్రమూర్తి వారి నివాసానికి వచ్చి చూడగా, తలుపు వేసి లోపల గడియ పెట్టి ఉంది. ఈ క్రమంలో అతను పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని తలుపులు తెరిచి చూడగా, ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. అనామిక, స్నిగ్ధ మంచంపై విగత జీవులుగా కనిపించారు. పక్కనే ఉన్న గదిలో శ్రీకాంత్ ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. కాగా, వారి నుదుటన ఎర్రని బొట్లు ఉన్నాయి. అలాగే దేవుడి గదిలో చిత్రపటాలు బోర్లించి ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అమీన్పూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇరు కుటుంబాల ఫిర్యాదుతో సీఐ శ్రీనివాసులు రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు