ఇందూరు, జనవరి 19: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం జాడిజమాల్పూర్కు చెందిన మల్లవరపు చిన్నయ్య బీఏ(ఆంగ్లం), పీజీ డిప్లొమా, పీఎంఐఆర్ విద్యార్హతలు సాధించారు. ఆర్టీసీలో సీనియర్ అసిస్టెంట్గా పని చేసిన ఆయన ఉద్యోగ విరమణ అనంతరం నగరంలోని గౌతంనగర్లో సిర్థపడ్డారు. రచయితగానే కాకుండా కవి, నాటక కర్త, స్క్రిప్ట్ రైటర్, నవలా రచయిత, స్టేజీ, రేడియో నాటకాలు, పాటలు, వ్యాసాలు తదితర రంగాల్లో సుప్రసిద్ధుడిగా పేరుగాంచారు. కవిగా అటు తెలుగులో, ఇటు ఇంగ్లిష్లో రాయడమంటే మామూలు విషయం కాదు. కరోనా మహమ్మారిపై పుస్తకాన్ని ఇంగ్లిష్లో రాసి ఆయనలో ఓ రచయితనే కాకుండా సైక్రియాటిస్ట్, జర్నలిస్టు, సైంటిస్ట్ దాగున్నాడని అభినందనలు పొందారు. జిల్లాలోనే ప్రముఖ కవుల్లో ఒకరిగా ఉన్నా ఇప్పటివరకు గుర్తింపు రాకపోవడం బాధాకరం. ఉద్యోగ విరమణ పొందిన అనంతరం పుస్తకాల రచయితగా, నూతన రచయితలకు సహకారాన్ని అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
ఒక్క పుస్తకం చదివి అర్థం చేసుకోవడమంటేనే తల ప్రాణం తోకలోకి వచ్చే ఈ రోజుల్లో.. తెలుగులో 20 పుస్తకాలు, ఇంగ్లిష్లో 20 పుస్తకాలు,5 అనువాదాలు చేసి ఔరా అనిపించుకుంటున్నారు ఇందూరు రచయిత. ఒక్క పుస్తకం రాస్తేనే పాపులారిటీ కోసం తాపత్రయ పడే వాళ్లుండగా, 45 పుస్తకాల రాసినా ఒదిగే ఉన్నారు. కరోనా మహమ్మారిపై పుస్తకాన్ని రాసి డాక్టర్లకే అంతుపట్టని విషయాలను పొందుపరిచి నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ ప్రశంసలు అందుకున్నారు మల్లవరపు చిన్నయ్య.
కన్నీటి నుంచి పుట్టిన కలం..
ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తీ తన జీవితం ఆనందమయంగా సాగాలని కోరుకుంటాడు. ఈ భూమిపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానం లభించాలని అభిలాషిస్తాడు. అది సహజమే, వారిలో నేనూ ఒకడిని అంటాడు చిన్నయ్య. కానీ తనకు ఊహ తెలిసేలోపే నాన్న పండించిన చెరుకు తోటలు, వరి పొలాలూ అన్నీ కలలా కరిగిపోయాయి. ఒకప్పుడు సిల్కు లాల్చిలతో నలుగురిలో నవాబులా చెలామణి అవుతూ ఉత్తమ రైతుగా పేరొందిన అతని తండ్రి కట్టుబట్టలతో వీధుల్లోకి నెట్టేయబడడం, ఆస్తిని మించిన అప్పులతో కష్టాలు ఎదురయ్యా యి. ఇంటికి జ్యేష్ఠ పుత్రుడైన చిన్నయ్య చదువు ఆగిపోయింది. దాదాపు సంవత్సరం తర్వాత చిన్నయ్య తండ్రి ఊరు విడిచి వెళ్లిపోయారు. దిక్కుతోచని స్థితిలో తాత, అమ్మమ్మ చెంత చిన్నయ్య, చెల్లెలు విజయ తలదాచుకున్నారు. అక్కడి నుంచి అనాథ శరణాలయంలో చేరి, అక్కడ ఇంగ్లిష్ మీడియంలో 5వ క్లాస్లో చేరాడు చిన్న య్య. పద్నాలుగు సంవత్సరాలు అనాథ శరణాలయంలో గడిపిన ఆయన పది, ఐటీఐ ఉత్తీర్ణుడయ్యాడు. హాస్టల్లో చేరిన సమయంలో తనకు విషజ్వరమని ‘నీలోఫర్’లో చేర్పిం చిన స్నేహితులు వెళ్లిపోయారు. రెండునాళ్లకే జ్వరం లేదని వైద్యులు బయటికి వెళ్లగొట్టిన నాడు అక్కడి నుంచి ‘ఫలక్నుమా’ వరకు నీరసంతో కండ్లు బైర్లు కమ్ముతూ నడిచిపోయిన చేదు అనుభవాలు, ఇలా ఎన్నో చితికిన ఈ చీకటి బతుకు నుంచి పారిన కన్నీటి నుంచే తన కలం పుట్టిందని చెబుతున్నాడు మల్లవరపు చిన్నయ్య.
సాహిత్యమంటే వల్లమాలిన అభిమానం
పేపర్లో వచ్చే కవితలు, వ్యాసాలు చదువుతూ, కవి సమ్మేళనాల్లో పాల్గొనడంతో సాహిత్యంపై మక్కువ పెరిగింది. నేను రాసిన నవలలు, కథలు పరిశోధన విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయంటే చాలా సంతోషంగా ఉంది. కరోనాపై నేను రాసిన పుస్తకం చదివి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందిస్తూ లేఖ రాయడం నాలో ఉత్తేజాన్ని నింపింది. నూతన రచయితలు రావాలి. యువకులకు రచనల్లో ఎలాంటి సందేహాలు ఉన్నా సంప్రదించవచ్చు. ప్రోత్సహిస్తే ఎంతోమంది రచనలు చేసేందుకు ముందుకొస్తారు.
అందుకున్న పురస్కారాలు
తెలంగాణ కళాతేజస్వి -2003
దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం -2011
కుందుర్తి ఉత్తమ పురస్కారం – 2011
కళా భూషణ – 2013
మదర్ థెరిస్సా ‘సాధన-స్ఫూర్తి’ అవార్డు – 2014
ఆరెట్టి నారాయణ స్మారక పురస్కారం – 2014
‘ఉగాది ఉషస్సు’ పురస్కారం – 2015
‘సాహిత్య దురీణ’ బిరుదు – 2017
సాహితీ సేవారత్న బిరుదు – 2017
సాహితీ ప్రద్యుమ్న – 2017
సాహితీ సవ్యసాచి – 2017
ప్రతిభామూర్తి పురస్కారం – 2018
ఎన్టీఆర్ ఎక్సలెన్సీ – 2018
పోలవరం వెంకటసుబ్బమ్మ
స్మారక పురస్కారం – 2018
టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి
గురురత్న పురస్కారం – 2019
కళావాచస్పతి
జాతీయ పురస్కారం – 2019
స్టార్ అవార్డు – 2019
విశిష్ట పురస్కారం – 2020
అపురూప అవార్డు – 2020