దామరచర్ల, జనవరి 17 : వాడపల్లి ప్రాంతాన్ని గతంలో రాజులు పరిపాలించారు. కృష్ణా మూసీ సంగమ ప్రాంతాన్ని రవాణా కోసం వినియోగించే వారు. దాంతో ఈ ప్రాంతం బంగారు నిధులతో నిండి ఉందనే ప్రచారం ఉంది. ఈ ప్రాంతంలో అడపాదడపా లభించిన బంగారు నిధులు ఈ ప్రచారానికి బలానిచ్చాయి. దీనికి తోడు వాడపల్లి కృష్ణా, మూసీ సంగమ ప్రాంతంలో వజ్రాలు ఉన్నట్లు వార్తలు రావడంతో వాటి కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్నారు. నాలుగు రోజుల క్రితం వాడపల్లి మీనాక్షీ అగస్తేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఉన్న పొలంలో కొందరు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. సదరు పొలం యజమాని ఆలయ అధికారులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బల్లపరుపుగా ఉన్న నాపరాయి కింద నిధులు ఉంటాయనే అనుమానంతో పక్కనే కొంతమేర తవ్వి వదిలేశారు.
మూడేండ్ల కింద..
మూడు దశాబ్దాల క్రితం వాడపల్లి ఆలయ సమీపంలో బలహీన వర్గాల ఇండ్ల నిర్మాణాల కోసం తవ్వకాలు జరుపుతుండగా పెట్టె లభించింది. ఆ పెట్టె నిండా బంగారు నాణేలు ఉండగా… సదరు నాణేలపై లక్ష్మీదేవి బొమ్మ ముద్రించబడి ఉంది. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా కొంత మంది రైతులు తమ పొలాలను దున్నతున్న క్రమంలో, ఇండ్ల నిర్మాణాల కోసం తీసిన పునాదుల్లో బంగారు కడ్డీలు లభించాయి. అప్పటి నుంచి గుప్తు నిధుల కోసం తవ్వకాలు ప్రారంభమయ్యాయి.
గుప్తు నిధుల కోసం పురాతన ఆలయాలు ధ్వంసం
కృష్ణానది తీరంలోని వాడపల్లి, దామరచర్ల, ఇర్కిగూడెం, వీర్లపాలెం, అడవిదేవులపల్లి, బాలెంపల్లి, మొల్కచర్ల, ముదిమాణిక్యం, వీరప్పగూడెం, గణేశ్పాడు గ్రామాల పరిసరాల్లో గుప్తనిధుల కోసం విపరీతంగా తవ్వకాలు జరిపారు. పురాతన ఆలయాలను ధ్వంసం చేశారు. విలువైన దేవతామూర్తుల విగ్రహాలను పగులగొట్టారు. నాటి రాజులు ఆలయాలు నిర్మించే సమయంలో విగ్రహాలు, ధ్వజస్తంభం కింద బంగారు నాణేలు వేసే వారు. కొంత మంది వాటికోసం ఆలయాలను ధ్వంసం చేశారు. అడవిదేవులపల్లిలోని పురాతన చెన్నకేశవ ఆలయాన్ని పెద్దపెద్ద జాకీలు పెట్టి లేపి నిధులు కోసం తవ్వకాలు జరిపారు. కృష్ణానది ఒడ్డున అటవీ ప్రాంతంలోని పురాతన ఆలయాలను సైతం ధ్వసం చేశారు. వాడపల్లి కృష్ణాతీరంలో సొరంగాలు ఏర్పాటు చేసి మరీ తవ్వకాలు జరిపిన దుండగులు పోలీసులకు పట్టుబడ్డారు.