భువనగిరి కలెక్టరేట్, జనవరి 20 : జిల్లాలోని అన్ని గ్రామాల్లో, మున్సిపల్ వార్డుల్లో నేటి నుంచి ఆశ, ఏఎన్ఎం, పంచాయతీ, మున్సిపల్ అధికారులతో కూడిన బృందాలు ఇంటింటి ఆరోగ్య సర్వే చేపట్టాలని జిల్లా ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు, జిల్లా పంచాయతీ అధికారి సునంద, మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఆరోగ్య సర్వేపై ఆమె సమీక్షించి మాట్లాడారు. ప్రతి ఇల్లు సర్వే చేయాలని, కుటుంబంలోని అందరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని, కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నది, లేనిది నమోదు చేయాలని అన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి హోం ఐసొలేషన్ కిట్లు అందించాలని సూచించారు. మందులు వేసుకునే విధానాన్ని వివరంగా తెలుపాలని, అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలించి వైద్యం అందించాలని అన్నారు. అన్ని ఆసుపత్రుల్లో కొవిడ్ ఓపీ సేవలను ప్రారంభించాలని, కొవిడ్ కేర్ సెంటర్, ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కాల్ సెంటర్ ఏర్పాటు చేసి కరోనా లక్షణాలు ఉన్నవారికి ప్రతిరోజూ ఫోన్ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని కనుక్కొని మందులు వేసుకునే విధానాన్ని వివరించాలన్నారు. ఫ్రంట్లైన్ వారియర్స్ ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకునేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దీపక్తివారీ, జిల్లా ప్రభుత్వ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ చిన్నానాయక్, డీఆర్డీఓ ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు.వంద శాతం
వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి హరీశ్రావు
భువనగిరి కలెక్టరేట్, జనవరి 20 : కరోనా నియంత్రణకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసి, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ ఓపీ సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్తో కలిసి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ నియంత్రణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పమేలాసత్పతి, అదనపు కలెక్టర్ దీపక్తివారీ, వైద్యారోగ్య శాఖ అధికారి సాంబశివరావు, జిల్లా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ చిన్నానాయక్, డీఆర్డీఓ ఉపేందర్రెడ్డి, డీపీఓ సునంద, వైద్య అధికారులు పాల్గొన్నారు.