ఆత్మకూరు(ఎం), జనవరి 14 : వ్యవసాయాభివృద్ధితో పాటు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇప్పటికే రైతుబంధు అమలు చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా 18నుంచి 59ఏళ్ల లోపు వారు ఏ కారణంతో మృతిచెందినా వారి కుటుంబానికి రూ.5లక్షల సాయమందించి భరోసా ఇస్తున్నది. ప్రభుత్వమే ఒక్కో రైతుకు ఏడాదికి రూ.2271.50 చెల్లించి ఉచిత బీమా సౌకర్యం కల్పించింది. మండలంలో మొత్తం 13,209మంది రైతులు ఉండగా రైతు బీమాకు 7,507మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటి వరకు మండలంలో 118మంది రైతులు మృతి చెందగా వారు సూచించిన నామినీ పేర ఉన్న బ్యాంకుల ఖాతాలో రూ.5.90కోట్లు ప్రభుత్వం జమచేసింది. గ్రామాల వారీగా రైతు బీమాను ఆత్మకూరు(ఎం)లో 16మంది, పల్లెర్లలో ఐదుగురు, కూరెళ్లలో 11, రాఘవాపురంలో 6, మొరిపిరాలలో 8, సింగారంలో 5, కొరటికల్లో 13, కప్రాయిపల్లిలో13, రహీంఖాన్పేటలో 12, లింగరాజుపల్లిలో 3, సర్వేపల్లిలో 6, రాయిపల్లిలో మూడు, పారుపల్లిలో నాలుగు, పల్లెపహాడ్లో ముగ్గురు, తుక్కాపురంలో 9మంది రైతులకు రైతు కుటుంబాలకు బీమా సాయం అందించారు.
రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వం రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడంతో పాటు పండించిన పంటకు మద్దుతు ధర కల్పిస్తున్నది. వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ అందించడంతో పాటు రైతుబంధు, బీమా పథకాలతో ఆదుకుంటున్నది. రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న ప్రభుత్వానికి రైతులు జేజేలు పలుకుతున్నారు.
రైతు బీమా వరం లాంటిది
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రవేశపెట్టిన రూ.5లక్షల ఉచిత బీమా పథకం అన్ని వర్గాల రైతులకు వరంలా మారింది. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసమే రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.