సుల్తాన్బజార్ : హిందువుల ఆరాధ్యదైవమైన గోమాతను రాష్ట్ర మాతగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలని లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ చైర్మన్ జస్మత్ పటేల్, రిథేష్ జాగిర్ధార్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ని ఆయన నివాసంలో కలిశారు.
వారితో పాటు తెలంగాణ పశు సంవర్ధక శాఖ సంచాలకులు ఎస్ రామచంద్ర, తెలంగాణ యానిమల్ వెల్ఫేర్ బోర్డు సభ్యులు స్వామి స్వయం భగవాన్ దాస్, సంఘ సేవకులు రమేష్ తివారీతో కలిసి వారు తలసానికి లవ్ ఫర్ కౌ మోమెంటోను అందించి సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గోమాతను హిందువులు భక్తి శ్రధ్దలతో పూజిస్తారని అన్నారు.
అటువంటి గోమాతలను వధించవద్దని చట్టాలు అమలులో ఉన్నప్పటికి గోవధ ఆగడం లేదని ఆవే దన వ్యక్తం చేశారు. కరోనా అనంతరం గోశాలల నిర్వాహణ చాలా ఇబ్బందికరంగా మారిందని ప్రభుత్వం గోశాలలకు ఆర్ధిక సహాయాన్ని అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు మంత్రి తలసానిని కోరారు. గోమాతను రాష్ట్ర మాతగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించేలా రాష్ట్ర అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపించాలని కోరారు.