సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే సాయన్న స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని కంటోన్మెంట్లో అమలు చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కారు మాత్రమేనని చెప్పారు.
గత పాలకులు కంటోన్మెంట్పై శీతకన్ను వేశారని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తూ ముందుకుసాగుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో బుధవారం కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్రెడ్డితో బోర్డు కార్యాలయంలో ఎమ్మెల్యే సాయన్నతో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ సభ్యుడు ప్రభాకర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ప్రధానంగా జీహెచ్ఎంసీ నుంచి కంటోన్మెంట్ బోర్డుకు డబుల్ బెడ్ రూం ఇండ్లకు సంబంధించిన తాగునీటి సరఫరా నీటి బిల్లులను మంజూరు చేసే అంశాలపై కీలకంగా చర్చించారు.
మడ్ఫోర్ట్లోని గాంధీనగర్, శ్రీరాంనగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాలకు చెందిన నీటి సరఫరా బిల్లులు సుమారు రూ. 28లక్షలు, కట్టమైసమ్మ సిల్వర్ కంపౌండ్లోని డబుల్ ఇండ్ల బిల్లులు దాదాపు రూ. 22.40లక్షలను కంటోన్మెంట్ బోర్డుకు జమ చేసిన విషయాన్ని సీఈఓ దృష్టికి తీసుకొచ్చారు.
ఆదే విధంగా రాష్ట్ర సర్కారు నుంచి రావాల్సిన టీపీటీ బకాయిలు త్వరలోనే విడుదల కానున్నాయని, పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చోరవ తీసుకోవాలని సీఈఓకు విన్నవించారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఈఓ అజిత్రెడ్డి బోర్డు పరిధిలో అభివృద్ధికి కచ్చితంగా కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.
సమావేశం అనంతరం ఎమ్మెల్యే సాయన్న, జక్కుల మహేశ్వర్రెడ్డిలు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జీహెచ్ఎంసీ మాదిరిగానే కంటోన్మెంట్లో ఉచిత తాగునీటి సరఫరా జరుగుతుందని, ఇప్పటికే బోర్డు అధికారులు, జలమండలి అధికారుల మధ్య పలు దఫాలుగా సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు.