ఆది నుంచీ విద్యారంగానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ‘మన ఊరు- మన బడి’ పేరిట ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు ఇటీవలి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లో ఆసక్తికర చర్చ సాగుతున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు రూ.7,289 కోట్లు కేటాయించారు. దీంతో తాగునీరు, మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు ఏర్పాటు కానున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సర్కారు బడుల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రైవేటు యాజమాన్యాల ఫీజుదోపిడీని నియంత్రించేందుకు పకడ్బందీ చట్టం రూపకల్పనకు సిద్ధమవుతున్నది. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలకు ఎంతో లాభం చేకూరనున్నది.
నిజామాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కానున్నాయి. కార్పొరేట్ బడులకు దీటుగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలకు భారీ స్థాయిలో ఊరట కల్పించేందు కు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఏడేండ్లుగా విద్యా వ్యవస్థను గాడిలో పెడుతూ వస్తున్న సీఎం కేసీఆర్… తాజాగా మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయాలు యావత్ రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ప్రైవేటు స్కూళ్ల ఫీజుల మోతను తగ్గించేందుకు, వారి వేధింపులపై కట్టడి చర్యలకు చట్టం రూపకల్పనకు సమాయత్తం అవుతున్నారు. ఎడాపెడా ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాల ఆట కట్టించేందుకు సర్కారు సిద్ధం అవుతుండడంపై ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులకు రూ.7,289 కోట్లు కేటాయించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గ్రామీణ ప్రాంతాల్లో తమ పిల్లలను స్థానిక సర్కారు బడులకు పంపే అవకాశాలు ఏర్పడ్డాయి.
ఇక పాత రోజులు…
ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల అంటే గదుల్లో కిక్కిరిసే విధంగా విద్యార్థులు.. అడ్మిషన్ల కోసం వరుసలు కట్టిన అనుభూతులు అనేకం. పైచదువుల కోసం పైరవీలు చేసుకుని సీట్లు పొందే పరిస్థితులు ఉండేవి. కాలక్రమేణా పట్టణీకరణ ప్రభావం, గ్రామాల్లో పెరిగిన ఆర్థిక స్వావలంభనతో ఒకరిని చూసి మరొకరు పల్లెల నుంచి పట్టణాల్లోని ప్రైవేటు స్కూళ్లకు పిల్లలను పంపడం మొదలైంది. రెండున్నర దశాబ్దాల కాలంగా ఈ సంస్కృతి విస్తరించడం, ఇదో రకంగా స్టేటస్ సింబల్గా మారడంతో ప్రభుత్వ బడులకు క్రమేణా ఆదరణ పడిపోతూ వచ్చింది. అత్యున్నత ప్రమాణాలతో బోధకులు ఉన్నప్పటికీ అవేవీ పట్టని నేటితరం తల్లిదండ్రులు మాత్రం భారం ఎక్కువైనా ప్రైవేటుకే మొగ్గు చూ పడం పెరుగుతున్నది. ఫలితంగా సర్కారు స్కూళ్లు ఆదరణ లేక కుదేలవుతున్న పరిస్థితులు నెలకొనగా ఇప్పుడిప్పుడే పాత రోజులు తిరిగి సంతరించుకుంటున్నాయి. కారణాలు ఏవైనప్పటికీ గత ఏడాదిన్నరగా తిరిగి ప్రభుత్వ స్కూళ్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతూ వస్తున్నది. ప్రైవేటు యాజమాన్యాలు ఫీజుల రూపంలో చూపిస్తున్న దాష్టీకాలను తాళలేక తిరిగి చాలా మంది ప్రభుత్వ బడులనే ఆశ్రయిస్తుండడం గమనార్హం. 2021-22 విద్యా సంవత్సరంలో 1166 ప్రభుత్వ స్కూళ్లలో లక్షా 9వేల 317 మంది విద్యార్థులు పేరును ఎన్రోల్ చేసుకోగా ఈ సంఖ్య 2020-21 విద్యా సంవత్సరంతో పోలిస్తే 20 నుంచి 30 శాతం అధికంగా ఉండడం విశేషం.
ఇంగ్లిష్తో పెరుగనున్న ఆదరణ…
ఇంగ్లిష్ మీడియం కోసం ప్రభుత్వ పాఠశాలలను వదిలి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత ప్రపంచీకరణ పరిస్థితుల్లో నేటి తరం విద్యార్థులు భవిష్యత్తులో రాణించాలంటే అన్నింటికీ ఇంగ్లిష్ అత్యవసరమైంది. అంతర్జాతీయంగా అనుసంధాన భాషగా మారిన ఇంగ్లిష్ లేకపోతే చిన్నచూపు చూసే దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల ఆలోచన ధోరణిపై మొన్నటి మంత్రి మండలి సమావేశంలో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. పేద, మధ్య తరగతి కుటుంబాలు రూ.వేలు ఖర్చు చేసి ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి గురవుతున్న నేపథ్యంలో సర్కార్ బడుల్లోనే ఆంగ్ల బోధన అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తద్వారా గ్రామాల్లోని విద్యార్థులు స్థానికంగానే ఉన్నటువంటి పాఠశాలల్లోనే విద్యను నేర్చుకునేందుకు ఆస్కారం ఏర్పడబోతున్నది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల బోధనకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రజల్లో సానుకూలత వ్యక్తమవు తున్నది. సీఎం తీసుకున్న నిర్ణయాన్ని సగ టు విద్యార్థి తల్లిదండ్రులు ఆహ్వానిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం చదువులతో గ్రామీణ ప్రాంత పిల్లలు సైతం పట్టణాలు, నగరాల్లో విద్యను అభ్యసించే వారితో సమానంగా ఎదుగుతారనే నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు.
గుడిలా బడి…
బడులకు కొత్తగా హంగులు అద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం బిగించారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు విడుదల చేసిన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 40శాతం మేర ప్రభుత్వ స్కూళ్లకే ఖర్చు చేయాలనే నిబంధనను తీసుకువచ్చారు. ఇలా ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ దగ్గర ఉన్న నిధులను బడుల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో పాటు తాజాగా మంత్రి మండలిలో రూ.7289 కోట్లు స్కూళ్ల కోసం కేటాయించడంతో బడులకు మహర్దశ పట్టనున్నది.
మారుమూల పాఠశాలల్లో మెరుగైన వసతులు సమకూరనున్నాయి. తాగునీరు, మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు ఏర్పాటు కానున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1166 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 1039 మండల ప్రజా పరిషత్, జిల్లా పరిషత్ స్కూళ్లు ఉండగా 117 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఆయా మండలాల్లో 10 ఆదర్శ పాఠశాలల్లోనూ పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. ఇవికాకుండా 25 కేజీబీవీలు ఉన్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు చట్టాన్ని తీసుకు వస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటన చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా జలగల్లా పీక్కు తింటున్న పలు యాజమాన్యాల ఆగడాలకు చెక్ పడనున్నది.