భద్రాచలం, జనవరి 21: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా రామయ్యకు బెంగళూరు భక్తులు సమర్పించిన సర్వాంగ స్వర్ణ కవచాలను ధరింపజేశారు. స్వర్ణ కవచాలతో సీతారామ లక్ష్మణులు మరింత రమణీయంగా దర్శనమివ్వడంతో భక్తులు ఆనంద పరవశులయ్యారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ తలుపులు తెరిచి స్వామివారి సుప్రభాత సేవ, ఆరాధన, సేవాకాలం, నివేదన, నిత్య బలిహరణం, నిత్య హోమాలు జరిపారు. అనంతరం నిత్యకల్యాణమూర్తులను బేడా మండపంలో ఉంచి సంప్రదాయబద్ధంగా నిత్యకల్యాణం జరిపారు. కల్యాణంలో పాల్గొన్న దాతలకు రామయ్య ప్రసాదాలను, శేషవస్ర్తాలను అందజేశారు.
అన్నదాన పథకానికి విరాళాలు…
భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన పథకానికి శుక్రవారం రూ.3,09,000 విరాళంగా వచ్చా యి. విశాఖపట్నానికి చెందిన ఉంగరాల వరలక్ష్మి దంపతులు రూ.1,03,000, కాకినాడకు చెందిన అడబాల భారతి దంపతులు మరో రూ.1,03,000, సామర్లకోటకు చెందిన ధూళిపూడి వెంకట సూర్య చంద్ర ధనలక్ష్మి దంపతులు ఇంకో రూ.1,03,000ను ఆలయ అధికారి కత్తి శ్రీనివాస్కు అందజేశారు. ముందుగా రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు తీర్చుకున్న అనంతరం ఆలయ అధికారికి అన్నదాన పథకానికి విరాళాలు అందించారు.