“కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. థర్డ్ వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉందని” రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కరోనా నివారణకు చేపట్టాల్సిన చర్యలు, దళిత బంధుపై బుధవారం కొత్తగూడెం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కావొద్దని, ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ రెండో డోస్ను నెలాఖ రులోగా వందశాతం పూర్తి చేయాలన్నారు. బూస్టర్ డోస్లో జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో ఉందని, భాగస్వాములందరికీ అభినందనలు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 19 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడిలో సర్కారు వైద్యం దేశానికి ఆదర్శంగా నిలవాలని, రెండు దశలను సమర్థవంతంగా ఎదుర్కొన్నందున అదే స్ఫూర్తితో పనిచేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. కరోనా కట్టడి చర్యలు, దళితబంధు అమలు వంటి అంశాలపై భద్రాద్రి కలెక్టరేట్లో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులందరూ తప్పకుండా టీకాలు వేసుకోవాలన్నారు. కేసులు పెరుగుతున్నందున అధికారులు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లా ఆస్పత్రితోపాటు అన్ని ప్రభుత్వ దవాఖానాల్లోనూ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలు కావొద్దని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా అధిక ఫీజులు వసూలు చేయకుండా యాజమాన్యాలతో చర్చించాలన్నారు. జిల్లా ఆస్పత్రి కమిటీ సమావేశం ప్రతి నెలా నిర్వహించాలని మంత్రి సూచించారు. వ్యాక్సినేషన్ రెండో డోస్ను ఈ నెలాఖరులోగా వందశాతం పూర్తి చేయాలన్నారు. రెండు డోస్లు పూర్తయిన వారు నిర్ణీత గడువు తర్వాత బూస్టర్ డోస్ వేసుకోవాలన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో హోం ఐసోలేషన్ కిట్లు అందించాలన్నారు. బూస్టర్ డోస్లో భద్రాద్రి జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ అభినందించారు. దళితుల అభివృద్ధికి చేపట్టిన ఈ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో శాసనసభ్యుల సహకారం తీసుకోవాలన్నారు. పర్యవేక్షణకు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద నియోజకవర్గానికి వందమందిని ఎంపిక చేసి వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయనున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారం వరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. 156 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ద్వారా 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, దీని విలువ రూ.185 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.100 కోట్లు చెల్లింపులు చేశామని వివరించారు. రానున్న విద్యా సంవత్సరంలో వైద్య తరగతులు నిర్వహణ చేపట్టనున్నందున 300 బెడ్ల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని, మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 100 బెడ్లు, ప్రధాన ఆస్పత్రిలో 240 బెడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి 15 నాటికి పనులు పూర్తి చేసి అప్పగించాలని సూచించారు. అనంతరం కొత్త కలెక్టరేట్ నిర్మాణాలను పరిశీలించారు.
రెండో డోస్ పూర్తి చేస్తాం: కలెక్టర్
భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ రెండో డోస్ వ్యాక్సినేషన్ను వంద శాతం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ మాస్కలు ధరించేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. దళితబంధు అమలు కోసం కొత్తగూడెం నియోజకవర్గానికి డీఆర్డీవో పీడీ మధుసూధన్రాజు, ఇల్లెందుకు ఉద్యాన అధికారి మరియన్న, భద్రాచలానికి సహకార అధికారి వెంకటేశ్వర్లు, పినపాకకు ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, అశ్వారావుపేటకు పరిశ్రమల శాఖ జీఎం సీతారాంను, వైరా నియోజకవర్గానికి ఆర్అండ్బీ అధికారి భీమ్లాను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు చెప్పారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు పాల్గొన్నారు.
నిర్మాణంలో నర్సింగ్ కాలేజీ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. ఇప్పటికే జిల్లా ఆసుపత్రి ఆవరణలో మెడికల్ కాలేజీ తరగతి గదుల కోసం బెడ్ల నిర్మాణాలను కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కొత్తగూడెం – పాల్వంచ మధ్యలో ఉన్న కేఎస్ఎం వద్ద నర్సింగ్ కాలేజీ నిర్మాణం పనులు చకచకా జరుగుతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఈ నిర్మాణం పూర్తి కానుంది.