శేరిలింగంపల్లి : కొండాపూర్ గౌతమి ఎన్క్లేవ్ విషాదం చోటుచేసుకుంది. అపార్టుమెంట్ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కోసం వచ్చిన కార్మికులు డ్రేనేజీ సంపులోకి దిగి ప్రమాదవశాత్తు విషవాయువులు వెలువడి ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతిచెందా రు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
సమాచారం అందుకున్న మాదాపూర్ అగ్నిమాపక దళ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఇద్దరుకార్మికులను దవాఖానకు తరలించారు. ఈ హృదయ విషాదకర సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
నల్గొండ జిల్లా, కొండపల్లి మండలం, మంజతండా గ్రామానికి చెందిన నానవత్ శ్రీను (38) బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి సైదాబాద్ సింగరేణి కాలనీ ఆదర్శనగర్లో భార్య సుజాత, కూతురు మౌనికా, కొడుకులు చరణ్, సిద్దులతో కలిసి నివసిస్తున్నాడు. రోజువారీ కూలీ పనులతో పాటు ఆటో డ్రైవర్గా, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ పనులు చేస్తుంటాడు.
నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట్ మండలం, అక్కారం గ్రామానికి చెందిన ఉలగొండ అంజయ్య అలియాస్ అంజి(32) నగరానికి వలసవచ్చి రోజువారీ కూలీ పనులు చేసుకుంటు భార్య పద్మ, కొడుకు అభిరాంతో కలిసి సైదాబాద్ సింగరేణి కాలనీ ఆదర్శనగర్లో నివాసం ఉంటున్నాడు. కాగా అదే కాలనీకి చెందిన స్వామీ సొంత సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనం కొనసాగిస్తు డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
అదే కాలనీవాసి జానీ సదరు వాహనానికి క్లీనర్గా పనిచేస్తున్నాడు. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహన యజమాని స్వామీ క్లీనర్ జానీలతో పాటు నానవత్ శ్రీను, ఉలగొండ అంజీలను తీసుకొని కొండాపూర్ గౌతమి ఎన్క్లేవ్ కాలనీలోని ప్లాట్ నెంబర్ 64లో 5 అంతస్థుల విస్తరించిన హేమదుర్గా ప్రెస్టీజ్ అపార్టుమెంట్ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేసేందుకు ఆదివారం ఉదయం 8 గంటలకు వచ్చారు.
డ్రైనేజీతో నిండిపోయిన సదరు అపార్టుమెంట్ సెప్టిక్ట్యాంక్ క్లీనింగ్ పనులు చేపట్టారు. గంట సేపు సంపులో నిండిపోయిన డ్రైనేజీ నీటిని తొలగించిన కార్మికులు నానవత్ శ్రీను, ఉలగొండ అంజీలు అ తర్వాత డ్రైనేజీ వ్యర్ధాలను తొలగించేందుకు సంపులోకి దిగారు. మొదట సంపులో డ్రైనేజీ వ్యర్థాల తొలగించే క్రమంలో విషవాయువులు వెలువడి నానవత్ శ్రీను ప్రమాదవశాత్తు ఉపిరాడక కుప్పకూలిపోయాడు.
అతన్ని కాపాడేక్రమంలో ఉలగొండ అంజి సైతం తీవ్ర డ్రైనేజీ వ్యర్థాల నడుమ ఉపిరాడక మృత్యువాతపడ్డారు. వీరిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించిన సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్, క్లీనర్లు స్వామీ, జానీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అపార్టుమెంట్ వాసుల ఫిర్యాదుతో 9ః30 గంటల సమయంలో హుటాహుటిన అక్కడకు చేరుకున్న మాదాపూర్ ఫైర్ అధికారులు, గచ్చిబౌలి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
తీవ్ర అస్వస్థతకు గురైన స్వామీ, జానీలను సమీపంలోని కొండాపూర్ ప్రభుత్వ దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు. సంపులో వ్యర్థాల నడుమ చిక్కుకుని ఉపిరాడక మృతిచెందిన నానవత్ శ్రీను, ఉలగొండ స్వామీల మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం బాధితుల కుటుంభసభ్యులకు సమాచారం అందించారు.
దీంతో మద్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకున్న మృతులు అంజీ, శ్రీనుల కుటుంభసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించి గుండెలు పగిలేలా రోదించారు. బాధితుల మృతదేహాలు అక్కడినుంచి తరలించరాదని మృతుల కుటుంభసభ్యులు సంఘటన స్థలంలో పోలీసులతో వాగ్వివాదానికి దిగి కాసేపు అందోళన కొనసాగించారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు పాటించకుండా పనులు చేపట్టిన ఇద్దరి మృతికి కారణమైన సెప్టిక్ట్యాంక్ యజమానిపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.