నీలగిరి, జనవరి 21 : పొలాల వద్ద, కాలువ కట్టల వెంట ఉంచిన ట్రాక్టర్ ట్రాలీలను అపహరించే దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి ఐదు ట్రాక్టర్ ట్రాలీలు, ట్రాక్టర్ ఇంజిన్, ఓ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి శుక్రవారం వెల్లడించారు. తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఎస్ఐ సత్యనారాయణ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. పట్టణంలోని ఏఆర్నగర్కు చెందిన దుంప సంపత్, కట్టంగూర్ మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన సురిగి మధు అనుమానస్పందంగా కనిపించడంతో ఆదుపులోకి తీసుకుని విచారించగా ట్రాక్టర్ ట్రాలీల దొంగతనం వెలుగులోకి వచ్చింది. వీరు నల్లగొండ ఏఆర్నగర్కు చెందిన దుంప అయిలయ్య, దుంప శివ, దుంప రాజు, పానగల్కు చెందిన ఆలకుంట్ల వెంకన్న, ఖమ్మానికి చెందిన ఓర్సు రామకృష్ణ, ఖమ్మ జిల్లా కొణిజర్లకు చెందిన దుబ్బల రఘుతో ముఠాగా ఏర్పడ్డారు. మొదటగా సురిగి మధు బైక్పై వెళ్లి నిర్మానుష్య ప్రదేశాల్లోని ట్రాక్టర్ ట్రాలీల వివరాలు సేకరించేవారు. అనంతరం రాత్రి సమయంలో దుబ్బల రఘుకు చెందిన ట్రాక్టర్ సాయంతో ట్రాలీలు అపహరించుకుపోయేవారు. ఇలా వీరు గతేడాది మార్చి 21న కట్టంగూర్ మండలం పిట్టంపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్ద, డిసెంబర్ 4న తిప్పర్తి మండలంలోని రామలింగాల గూడెంలో, డిసెంబర్ 7న ఖాజీరామారంలో, డిసెంబర్ 17న కొరివేనిగూడెంలో, ఈ జనవరి 7న నల్లగొండ మండలం దండెంపల్లిలో మొత్తం ఐదు ట్రాలీలను చోరీ చేశారు. దొంగిలించిన ట్రాలీలను ఖమ్మంకు తరలించి అమ్మి సొమ్ము చేసుకునేవారు. ముఠా సభ్యుల్లో దుంప సంపత్, సురిగి మధు, అలకుంట్ల వెంకన్న, ఓర్సు రామకృష్ణ, దుబ్బల రఘును ఆరెస్టు చేయగా మిగిలిన ముగ్గురు దుంప అయిలయ్య, దుంప శివ, దుంప రాజు పరారిలో ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కేసును సమర్థవంతంగా చేదించిన శాలిగౌరారం సీఐ రాఘవరావు, తిప్పర్తి ఎస్ఐ సత్యనారాయణ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.