నిజామాబాద్ క్రైం, జనవరి 17: కొన్ని నెలలుగా నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వాహనాల దొంగతనానికి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.వారి నుంచి ద్విచక్రవాహనాలతోపాటు ఆటో రిక్షాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ కే.ఆర్.నాగరాజు సోమవారం వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన షేక్ ముజాహిద్(19), షేక్ మోసిన్(24), మహారాష్ట్రలోని హిమాయత్ నగర్కు చెందిన షేక్ మతిన్(24) ముగ్గురు కలిసి కొన్ని నెలలుగా రోడ్ల పక్కన, కాలనీల్లో నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాలు, ఆటో రిక్షాలను ఎత్తుకెళ్లారు. ఈ ముఠాను పట్టుకునేందుకు నిజామాబాద్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐలు టి.శ్రీహరి,కృష్ణ తో పాటు నగర సీఐ సత్యనారాయణ దర్యాప్తు చేపట్టారు. సోమవారం నగరంలోని బోర్గాం(పి) ప్రాంతంలో వాహనాల తనిఖీలు చేపట్టగా, అనుమానాస్పదంగా వచ్చిన ముగ్గురిని పోలీసులు విచారించారు. దీంతో వారు వాహనాలను దొంగిలించినట్లు అంగీకరించారని సీపీ తెలిపారు. పట్టుబడిన నిందితుల నుంచి ఎనిమిది బైకులు, రెండు ఆటో రిక్షాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. వాహనాల దొంగలను పట్టుకునేందుకు కృషి చేసిన నాల్గో టౌన్ ఎస్సై తోపాటు సీసీఎస్ టీం సభ్యులు వెంకటయ్య, సుభాష్, నరేశ్, సురేశ్, శంకర్, నీలేశ్, కాసయ్య, బాలకిషన్ను అభినందించారు. దీంతో పాటు సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. సమావేశంలో అదనపు డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ వెంకటేశ్వర్, సీసీఎస్ సీఐలు శ్రీహరి, కృష్ణ, ఎస్సై సందీప్ పాల్గొన్నారు.