మన్సూరాబాద్ : రెండు చేతులు లేకున్నా నోటితో బొమ్మలు గీస్తున్న మౌత్ ఆర్టిస్ట్ కె. స్వప్నికకు ఉప్పల ఫౌండేషన్ చేయూతనిచ్చింది. శ్రీకాకుళంకు చెందిన కొవ్వాడ సరస్వతి తమ కుమార్తె కె. స్వప్నికతో కలిసి నగరానికి వచ్చి ప్రస్తుతం బంజారాహిల్స్లో నివాసముంటున్నారు.
రెండు చేతులు లేనప్పటికీ స్వప్నిక మొక్కవోని పట్టుదలతో నోటితో బొమ్మలు గీస్తూ అందరి మన్ననలు పొందింది. తండ్రి మృతిచెందడం, తల్లికి మూర్చ వ్యాధి ఉండటంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని కొందరు వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన ఆయన సోమవారం ఉప్పల ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో రూ. 20 వేలను స్వప్నికకు అందజేశారు. ఈ సందర్భంగా కె. స్వప్నిక తన నోటితో గీసిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు. కార్యక్రమంలో ఎం. నందకిషోర్, బి. కిషోర్ తదితరులు పాల్గొన్నారు.