దేశంలోనే ఎక్కడా లేని పథకాలతో వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రైతు సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తోంటే, కేంద్రంలోని మోదీ సర్కార్ మాత్రం రైతులకు వెన్నుపోటు పొడుస్తున్నదని జిల్లా ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ఏడేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి కూడా రైతు అనుకూల నిర్ణయాలు తీసుకోలేదని గుర్తుచేశారు. కార్పొరేట్ సంస్థలకు పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తూ వ్యవసాయ రంగాన్ని రైతు బతుకును అధోగతిపాలు చేస్తున్నదని మండిపడ్డారు. రైతాంగం నడ్డి విరిచేలా పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ చేసే పోరాటంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ శ్రేణులు ముందుండి నడిపించాల్సినఅవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేయగా, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య , గాదరి కిశోర్ కుమార్, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్ విలేకరుల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
నల్లగొండ ప్రతినిధి, జనవరి13 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని మంత్రి జగదీశ్రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏడేండ్లలో బీజేపీ సర్కార్ అన్నీ రైతు వ్యతిరేక విధానాలనే చేపట్టిందని ఆరోపించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోదీ సర్కార్ కేవలం దళారుల ఆదాయాన్నే పెంచగలిగిందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ విధానాలతో రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా మారుతుంటే కేంద్ర ప్రభుత్వ విధానాలు అందుకు అవరోధంగా మారాతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నంపెట్టే రైతన్నలపై ధరలతో పెనుభారం మోపుతూ లాభాపేక్ష కార్పొరేట్ సంస్థలకు వేలకోట్ల రాయితీలు ఇస్తున్న ఘనత మోదీ సర్కారుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. అందుకే కేంద్రంపై సీఎం కేసీఆర్ ప్రకటించిన పోరాటంలో టీఆర్ఎస్ శ్రేణులు ముందుండాలని సూచించారు. పెంచిన ఎరువుల ధరలతోపాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే వరకు సాగే పోరాటంలో ఉమ్మడి జిల్లా ప్రజలను, ముఖ్యంగా రైతులు కలిసిరావాలని పిలుపునిచ్చారు. శాలిగౌరారంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న మోడీ సర్కార్.. వ్యవసాయంలో పెట్టుబడులను మాత్రం రెట్టింపు చేయగలిగాడని ఎద్దేవా చేశారు. రైతుల నడ్డివిరిచే విధంగా ఎరువుల ధరలను పెంచడం దారుణమన్నారు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు, రైతులు సతమతం అవుతుంటే పెరిగిన ఎరువుల ధరలు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారిందన్నారు. 90రోజుల్లోనే ఎరువుల ధరలను రెట్టింపు చేసిన ఘనత స్వతంత్ర భారతంలో మోడీ సర్కారుకు మాత్రమే దక్కిందన్నారు. పెరిగిన ఎరువుల ధరల భారం రైతులపై పడకుండా కేంద్రమే భరించాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకురాకుండా, ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయకుండా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు మోదీ సర్కార్ కుట్రలు చేస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోటర్లకు మీటర్లు పెట్టాలంటూ ఒత్తిడి చేస్తూ మరోభారం మోపాలని కుట్రలు చేస్తుందన్నారు. రాష్ట్ర రైతాంగంతో పాటు దేశ రైతాంగానికి మేలు జరిగేలా సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాల్లో ప్రజలు కలిసిరావాలని కిశోర్కుమార్ పిలుపునిచ్చారు. చిట్యాలలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ సర్కార్ అధికారంలోకొచ్చిన నాటి నుంచి రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని ఇరువురు ఎమ్మెల్యేలు ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కుట్రలు పన్నిన కేంద్రం తాజాగా ఎరువుల ధరల పెంపుతో రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. సీఎం కేసీఆర్ రైతులకు అండగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఆ పథకాలకు తూట్లు పొడిచేలా కేంద్రం విధానాలు ఉంటున్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర నేతలకు దమ్ముంటే పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేయాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో రానున్న రోజుల్లో బీజేపీ నేతలు గ్రామాలకు వచ్చే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. గతంలో నల్లగొండ జిల్లాలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు బుద్ధి చెప్పిన రీతిలోనే తగిన శాస్తి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాగే పోరులో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తిరుమలగిరిసాగర్లో రైతుబంధు సంబురాల్లో ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ దేశంలోనే రైతుసంక్షేమ సర్కార్ కేసీఆర్తోనే సాధ్యమైందన్నారు. ఉచిత విద్యుత్, రైతుబంధు, రుణమాఫీ, రైతు బీమా, ప్రాజెక్టుల నిర్మాణాలతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన ఘనత కేసీఆర్దేనన్నారు. ఓ వైపు రాష్ట్రంలో రైతును నిలబెట్టే ప్రయత్నాలు చేస్తుంటే కేంద్రంలోని మోదీ సర్కార్ రైతును కిందకు లాగే కుట్రలు చేస్తుందన్నారు. పెంచిన ఎరువుల ధరలు రైతులకు మోయలేని భారాలుగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగం కోసం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, కేంద్రంపై కేసీఆర్ చేసే పోరాటంలో ప్రజలు కలిసిరావాలని భగత్ పిలుపునిచ్చారు.
మునుగోడులో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ రైతుబంధుతో వ్యవసాయంలో సమూల మార్పులు వచ్చాయన్నారు. సమైక్య పాలనలో పడావు ఉన్న భూములన్నీ సాగులోకి వచ్చాయని, అందుకు రాష్ట్రంలో పెరిగిన పంటల ఉత్పత్తులే నిదర్శనమన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తుంటే మోదీ సర్కార్కు రైతుకు వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తుందని ఆరోపించారు. రైతులకు అన్యాయం చేస్తుంటే కేసీఆర్ ఊరుకోరని, అందుకే కేంద్రంపై కేసీఆర్ చేసే పోరాటంలో రైతులు ముందు నడవాలని పిలుపునిచ్చారు.
రైతు వ్యతిరేక కేంద్రంపై పోరాటాలకు సిద్ధం కావాలి
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్న మోదీ సర్కార్ దళారుల ఆదాయాన్ని మాత్రమే రెండింతలు పెంచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన విధానాల వల్లే తెలంగాణలో రైతుల ఆదాయం పెరిగిందన్నది సుస్పష్టం. కానీ కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువులు, డీజిల్, పెట్రోల్ ధరలతో తెలంగాణ రైతు జేబుకు కుడా చిల్లు పడింది. గడిచిన ఏడేండ్ల బీజేపీ పాలనలో భారత దేశ రైతుకు ఒరిగిందేమీ లేదు. బీజేపీ ప్రభుత్వం మోసపూరిత విధానాల పట్ల రైతాంగం అప్రమత్తంగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువులు, డీజిల్ ధరలు తగ్గించే దాకా ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం, టీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలి.