ఎర్రుపాలెం/ వైరా, జనవరి 21: జ్వర సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం గ్రామంలో రైతువేదికలో పలు శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి అర్హులైన రైతులకు త్వరలోనే పాస్పుస్తకాలు అందిస్తామని అన్నారు. కలెక్టర్తో పలువురు రైతులు మాట్లాడుతూ ఎర్రుపాలెం మండలానికి విద్యుత్ ఏఈని మంజూరు చేయాలని కోరడంతో వెంటనే ఎస్ఈతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అనంతరం జమలాపురంలో జరిగిన ఇంటింటి జ్వర సర్వేలో భాగంగా పలుగృహాలను సందర్శించారు. సర్వే తీరును కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. జమలాపురం తండాలో కూలి పనులకు వెళ్లి వస్తున్న కూలీలతో కొంతసేపు సంభాషించి వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలో ఆపి కూలి పనులకు వెళ్లి వస్తున్న అక్కాచెల్లెళ్లలో వేల్పుల మనీషా డిగ్రీ చదివుకునేందుకు, నిరీషా ఇంటర్మీడియట్ చదువుకునేందుకు తగిన అవకాశాలను కల్పించే విధంగా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ట్రైనీ కలెక్టర్ రాహుల్, డీఎంహెచ్వో మాలతి, ఆర్డీవో రవీంద్రనాథ్, వైరా ఏసీపీ స్నేహామెహ్రా, సీఐ మురళి, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, ఎంపీడీవో అశోక్, ఏవో విజయభాస్కర్రెడ్డి, ఎంఈవో ప్రభాకర్, డిప్యూటీ తహసీల్దార్ అన్సారీ, సర్పంచ్ ముల్పూరి స్వప్న, సొసైటీ చైర్మన్ ముల్పూరి సాంబశివరావు, మండల అధ్యక్షుడు డాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
6 నెలల్లో వెజ్, నాన్వెజ్ మార్కెట్ను నిర్మిస్తాం
కూరగాయల వ్యాపారులు వైరా మున్సిపాలిటీకి సహకరిస్తే ఆరు నెలల్లోనే సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ను ఆధునాతనంగా నిర్మిస్తామని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. వైరాలో రూ.5 కోట్లతో నిర్మించనున్న సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ స్థలాన్ని, ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్ను శుక్రవారం ఆయన పరిశీలించారు. ముందుగా వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, కమిషనర్ వెంకటస్వామితో మార్కెట్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులపై సమీక్షించారు. నిర్మాణ ప్లాన్ మ్యాప్ను పరిశీలించారు. కూరగాయల మార్కెట్ను సందర్శించి అక్కడి వ్యాపారులతో మాట్లాడారు. మార్కెట్లో మినహా బయట రోడ్లపై తోపుడు బండ్లపై కూరగాయలను విక్రయించే వ్యాపారులను అనుమతించవద్దని సూచించారు. అలా చేస్తే మార్కెట్లోని వ్యాపారులు దెబ్బతింటారని అన్నారు. మండల ప్రత్యేకాధికారి కస్తాల సత్యనారాయణ, తహసీల్దార్ అరుణ, ఎంపీడీవో వెంకటపతిరాజు, ఏఈ అనిత తదితరులు పాల్గొన్నారు.