సంగారెడ్డి, జనవరి 14(నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులపై కక్షకట్టినట్లుగా వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. కేంద్రం డీజిల్, పెట్రోలు ధరలు పెంచటంతో రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడిందన్నారు. తాజాగా, ఎరువుల ధరలు పెంపు వారిని మరింత కష్టాల్లోకి నెట్టిందని, ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభు త్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ధరలు వెంటనే తగ్గించాలని రైతుల పక్షాన సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖరాశారని, ఒకవేళ స్పందించకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని తెలిపారు. శుక్రవారం సంగారెడ్డిలోని డీసీఎంఎస్ కార్యాలయంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్తో కలిసి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదన్నారు. ఏడాది కాలంలో ఎరువుల ధరలను రెండు స్లారు పెంచిందని, సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిస్తే కేంద్రం రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి పంటపొలాలకు సాగునీరు అందుతున్నదని, కేంద్ర సహాయం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో రూ.5వేల కోట్లతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల నిర్మిస్తున్నామని, దీంతో జిల్లా సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అమలు చేయటంతో పాటు నల్లచట్టాలను తీసుకువస్తున్నదని,వ్యవసాయబోర్లకు మీటర్లు బిగించేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతులు కోరుతున్నా మోదీ పట్టించుకోవడంలేదని, త్వరలోనే తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని, డీజిల్, పెట్రోలు ధరలతో పాటు ఎరువుల ధరలు అమాంతంగా పెంచి రైతులపై అధిక భారం మోపిందన్నారు. ముఖ్యంగా పొటాష్, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచడంతో తీవ్ర ఇబ్బందులు పడనున్నట్లు చెప్పారు. అన్నిరకాల ఎరువులపై రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు ధరలు పెంచారని, వీటిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో వ్యవసాయం రంగానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఉచిత కరెంటు, సాగునీరుతో పాటు రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందజేస్తున్నట్లు చెప్పారు. దీంతో, ఉమ్మడి మెదక్ జిల్లాలో సాగు విస్తీర్ణం 8 లక్షల ఎకరాల నుంచి 13 లక్షలకు చేరుకున్నట్లు తెలిపారు. సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల కోసం అనే పథకాలు అమలు చేస్తుంటే, మోదీ సర్కార్ మాత్రం రైతు వ్యతిరేక చట్టాలతో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్నదన్నారు. పెంచిన ఎరువుల ధరలను కేంద్రం వెంటనే తగ్గించాలని, కాంగ్రెస్ పార్టీ ఎరువుల ధరలపై స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం పెరిగిన ధరలపై ఎక్కడా మాట్లాడటంలేదన్నారు. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు చిల్వెర ప్రభాకర్, డా.శ్రీహరి, విజయేందర్రెడ్డి, ప్రభుగౌడ్, ఆర్.వెంకటేశ్వర్లు, పెరుమాళ్ల నర్సిం హులు, జలందర్, మధుసూదన్రెడ్డి, విష్ణువర్ధన్, చక్రపాణి, నసీరుద్దీన్ అబ్దుల్లా, ప్రవీణ్, యూనిస్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.