మునిపల్లి, జనవరి 22: ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో.. ఫేస్బుక్ కొందరి పాలిట శాపంగా మారుతున్నది. ఇటీవల కాలంలో ఫేస్బుక్ వినియోగం భారీగా పెరిగింది. ఫేస్బుక్ వాడే విద్యార్థులు, యువతీయువకుల సంఖ్య పెరిగిపోతున్నది. క్రమంగా కొందరు దీనికి బానిసలుగా మారుతుండడం కలవరపెడుతున్నది. అసలు ఫేస్బుక్ అకౌంట్ లేకుంటే నామోషీగా ఫీలయ్యేవారు కొందరైతే, మరికొందరు స్వయం కృతాపరాధంతో ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. ఫేస్బుక్లో ఎక్కువ సమయం గడపడం ప్రమాదకరమని తెలిసినా, ఫేస్బుక్ వాడడం తగ్గించడం లేదు.
ఫేస్బుక్లోనే చక్కర్లు…
స్నేహితులను ఆన్లైన్లో కలుసుకోవడంతో పాటు తమ జ్ఞాపకాలు, అనుభూతులను పంచుకునేందుకు శుభాకాంక్షలు తెలుపుకొనేందుకు, సమాచారాలు, ప్రచారాల కోసం ఫేస్బుక్ను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. విద్య, సినిమాలు, రాజకీయాలు, జన్మదిన, వివాహ దినోత్సవం శుభాకాంక్షలు, విషాద సంఘటనలు, వివిధ సామాజిక అంశాలపై తమ అభిప్రాయాలను ఫేస్బుక్లో పంచుకుంటున్నారు. రోజువారి కార్యక్రమాల్లో ఫేస్బుక్ లాగిన్, చాటింగ్ చేరిపోయింది. యువతీయువకులే కాకుండా వయస్సుతో సంబంధం లేకుండా పెద్దసంఖ్యలో జనం ఈ సామాజిక సైట్ను విరివిగా వాడేస్తున్నారు. దీనితో కొన్ని ప్రయోజనాలున్నా, మరికొన్ని దుష్ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల వెలుగు చూస్తున్న కొన్న సంఘటనలు, ఫేస్బుక్ వినియోగంతో కలిగే నష్టాలను స్పష్టం చేస్తున్నాయి. అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్ స్నేహం ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తుందో వెల్లడిస్తున్నాయి.
అపరిచిత వ్యక్తులతో అసలుకే ఎసరు…
ఇటీవల వెలుగు చూసిన కొన్ని సంఘటనలు ఫేస్బుక్ వినియోగంతో కలిగే నష్టాలను స్పష్టం చేస్తున్నాయి. అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్ స్నేహం ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తుందో వెల్లడిస్తున్నాయి. కొందరు వక్రబుద్ధి గలవారు అమ్మాయిల ఫొటోలను మార్పింగ్ చేసి పెట్టడం, బ్లాక్మెయిల్ చేయడం లాంటివి అనేకం వెలుగు చూస్తునే ఉన్నాయి. బాధిత యువతీయువకులు తల్లిదండ్రులకు చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతూ అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలు.
చివరకు బానిసల్లా…
పలువురు విద్యార్థులు, యువతీయువకులు చివరికి తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో మాట్లాడే తీరిక లేకుండా ఫేస్బుక్కు కనెక్ట్ అవుతున్నారు. పాఠశాలలకు వెళ్తున్నారో లేదోగానీ, రోజు ఫేస్బుక్లో తప్పని సరిగా ప్రత్యక్షమవుతున్నారు. కొందరైతే తిండిమానేసి మరీ సెల్ఫోన్లు, కంప్యూటర్తోనే కాలక్షేపం చేస్తున్నారు. లేచిన నుంచి పడుకునేదాక అదే ధ్యాసలో మునుగుతున్నారు. కొందరైతే గుడ్నైట్ అని పోస్ట్చేసి మరీ ఫోన్ను పక్కలోనే పెట్టుకొని పడుకుని తెల్లవారి లేవగానే మళ్లీ గుడ్మార్నింగ్ అంటూ పోస్టుతోనే దినచర్యను ప్రారంభిస్తున్నారు. గంటల తరబడి ఫేస్బుక్ వాడకంతో దృష్ట, మానసిక లోపాలతో అనేక మంది బాధపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
స్నేహానికి వారధి మాత్రమే…
స్నేహానికి వారధిలా, పరిచయాలకు పునాదిలా ఫేస్బుక్ను చూడాలి. కానీ, జీవనశైలిలి, గమనాన్ని మార్చే సాధనంలా పేస్బుక్ను చూడరాదన్న విషయాన్ని వినియోగదారులు, ముఖ్యంగా యువత గమనించాల్సి ఉంది.
ఫేస్బుక్తో టైం వేస్టు చేసుకోద్దు..
పరిమిత సమయానికి మించి ఫేస్బుక్లో గడపడం మంచిదికాదు. కొంతమంది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పరిచయాలు పెంచుకుని దారి తప్పించే ప్రయత్నాలు చేస్తారు. అలాంటి వాటిని త్వరగా గుర్తించి దూరం ఉంటేనే మంచిది. సమయం ఎంతో విలువైనది. దానికి వృథా చేసుకోవద్దు. ప్రధానంగా యువత చదువు, తమ కెరీర్ మీద దృష్టిసారించాలి. ప్రస్తుతం పోటీ ప్రపంచం నెలకొంది. ఏ రంగంలో రాణించాలన్నా, మంచి అవకాశాలు పొందాలన్నా, మంచిగా స్థిరపడాలన్నా కష్టించాలి. ఈ నేపథ్యంలో సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. సామాజిక మాధ్యమాలు ఉపయోగిస్తూ అనవసరం సమయాన్ని వృథా చేసుకోవద్దు.
జర జాగ్రత్త…