బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజ్, తెలంగాణ హ్యూమన్రైట్స్ కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ‘జస్టిస్ ఆన్ వీల్స్’ పేరుతో మానవ హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ.. రాజ్యాంగం భారత పౌరులందరికీ సమానమైన హక్కులను కల్పించిందని, తమకు సంక్రమించిన హక్కులపై సరైన అవగాహన లేకపోవడంతో పలు వర్గాలకు చెందిన ప్రజలు అణిచివేతకు గురవుతున్నారని పేర్కొన్నారు.
మానవహక్కులపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మైనార్టీల హక్కులను హరించేలా కొన్ని సంఘటనలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయని, అలాంటి సంఘటనలను సమిష్టిగా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్స్పల్ డా. వీ.గీతారావు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొ. గాలి వినోద్కుమార్, డా.ఎన్.వెంకటేశ్వర్లు, హెచ్చార్సీ సీఈవో విద్యాసాగర్, సభ్యులు ఆనంద్రావు, మహ్మద్ ఇర్ఫాన్, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.