కొండాపూర్ : ప్రతి పౌరుడు పోలీసేనని… ప్రతి పోలీసు ఒక పౌరుడేనని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. మంగళవారం మాదాపూర్లోని ఓ హోటల్లో ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కరోనా మహమ్మారీ విజృంభన, లాక్డౌన్ పరిస్థితుల అనంతరం ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చిందన్నారు. ప్రతి పౌరుడు ఓ పోలీసులా, ప్రతి పోలీసు ఓ పౌరుడిలా తమ విధులను నిర్వర్తిస్తున్నారన్నారు. లాక్డౌన్తో ఆన్లైన్ సేవలు విస్తృతమయ్యాయని, దీంతో సైబర్ నేరగాళ్ళు నయా మోసాలకు తెరలేపారన్నారు.
గతంలో ఉన్న దోపిడీలు, దొంగతనాలు, పాత నేరాలు తగ్గుముఖం పట్టగా, కొత్తగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. ఆన్లైన్లో అప్పనంగా అధిక మొత్తంలో సొమ్ము వస్తుందన్న మోసపూరిత ప్రకటనలు నమ్మి చాలా మంది మోసపోతున్నారన్నారు. ఇంగీత జ్ఞానాన్ని వినియోగిస్తే ఇలాంటి సైబర్ నేరాలు అదుపులోకి వస్తాయన్నారు. పోలీసులు, ప్రజల మధ్య సత్ససంబంధాలు పెరిగినప్పుడు సమాజం మెరుగవుతుందని, నేరాలు తగ్గుముఖం పట్టి శాంతి భద్రతలు రెట్టింపవుతాయన్నారు. 1912 సంవత్సరంలోనే నగర పోలీసులకు 12 సైకిళ్ళను అందజేసి సైకిల్ పెట్రోలింగ్ ప్రారంభించగా, అది నేడు సైబర్ పెట్రోలింగ్ స్థాయికి చేరిందన్నారు.
వందేండ్లకు పైగా ఉత్తమ సేవలందించిన సుధీర్ఘ ప్రయాణం పోలీసులకుందన్నారు. అనుభవం, నైపుణ్యత, నిబద్ధతలతో పోలీసు శాఖ విధులలో ఉత్తమ సేవలందిస్తుందన్నారు. హైదరాబాద్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం ప్రత్యేకంగా ఎంప్లాయిమెంట్ వ్యాన్ను ఏర్పాటు చేసి సేవలందిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ సంపాదనకు అవసరమైన స్కిల్స్ని నేర్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఇప్పటికే వేలాది మందికి జాబ్ మేళాల ద్వారా ఉద్యోగాలు ఇప్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ ఉమా చిగురుపాటి, ఎఫ్ఎల్ఓ ప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.