ఖైరతాబాద్ : ‘యూరప్లాంటి దేశాల్లో అవినీతిని నిష్కృష్టంగా భావిస్తారు….మన దేశంలోనూ అలాంటిది వస్తేనే దాని నిర్మూలన సాధ్యమవుతుంది… ప్రతి పౌరుడు అవినీతి నిర్మూలనను బాధ్యతగా తీసుకోవాలి’ అని ఆర్టీఐ కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి అన్నారు.
యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో వరల్డ్ యాంటీ కరప్షన్ డే వాక్ను పీవీ నరసింహారావు మార్గ్ లోని పీపుల్స్ప్లాజా వద్ద నిర్వహించారు. ఈ వాక్ను ముఖ్య అతిథులుగా హాజరైన కట్టా శేఖర్ రెడ్డి, మాజీ సమాచార హక్కు చీఫ్ కమిషనర్ డాక్టర్ వరె వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు.
శేఖర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో అవినీతి వటావృక్షంగా పెరుగుతున్నదని, డబ్బులు ఇవ్వడమనేది హక్కుగా భావించ డం ఆఫీసులు, అధికార యంత్రాంగంలో కనిపిస్తున్నదన్నారు. దానిని ఎదుర్కొని నిలదీయాలన్నారు. కేవలం ఒక ర్యాలీ, సభను పెడితే సమస్య పరిష్కారం కాదని, పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు, ఉద్యమాలు జరుగాలన్నారు.
దేశానికి, రాష్ట్రాలకు నాయకత్వం వహించే వారు ఆదర్శాలతో ఉంటే సమాజం మొత్తం ఆదర్శంగా ఉంటుందన్నారు. ప్రజలు వారి బాటలో నడుస్తారన్నారు. అవినీతికి పాల్పడుతూ ఆడంబరాలు ప్రదర్శిస్తే ఆ సమాజం కుళ్లిపోతుందన్నారు.
లివ్ బై…. లీడ్బై…. ఎగ్జాంపుల్ అనేది ఒక నినాదం కావాలని, ప్రతి పౌరుడికి అప్పుడే సమాజంలో అవినీతిని అరికట్టడానికి ఆస్కారముంటుందన్నారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఇలాంటి కార్యక్రమాలతో ఇతరుల్లో స్ఫూర్తి నింపుతున్నదన్నారు.
డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మన దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య అవినీతి అని, పరిపాలనలో పారదర్శకత లేకపోవడం, అధికారుల్లో జవాబుదారీ తనం ఉండకపోవడం కనిపిస్తుందన్నారు. అవినీతి నిర్మూలన అనేది పాలక ప్రభుత్వాలు అనుకుంటే సరిపోదని, దేశంలోని ప్రతి పౌరుడు కరప్షన్ను ప్రశ్నించినట్లయితే దానిని నిరోదించవచ్చన్నారు.
‘అవినీతి లేని సమాజాన్ని హక్కుగా భావించి దానిలో మన బాధ్యత ఏమిటో తెలుసుకొని ప్రవర్తించాలి’ అన్నది ఈ ఏడాది థీమ్గా ఎంచుకున్నట్లు తెలిపారు. విద్యార్ధి, యువత, మీడియా ప్రతినిధులు ఈ అంశంపై బాధ్యతగా వ్యవహరించా లన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వ్యవస్థాపకులు రాజేంద్ర పల్నాటి, రంగారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నర్సింహా రెడ్డి, వైఏసీ మీడియా కార్యదర్శి జయరాం, కోమటి రమేశ్ బాబు, దేవేందర్, ఎన్సీసీ అధికారిణి సంతోషిణి, గంగాధర్, సతీశ్, హరి, రాకేశ్, ఆజేష్, మారియా, ఆంథోని, డాక్టర్ ప్రతిభాలక్ష్మి, డాక్టర్ స్రవంతి, రమేశ్ నాయక్, సాయినాథ్ రెడ్డి, సంపత్, వెంకటేశ్, సినీ నటులు శివనాగరాజు, ప్రభాస్ రాజు, సుజాత, సురేశ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.