డబ్బున్న వారు చదివే ఇంగ్లిష్ మీడియం చదువులను రాష్ట్ర ప్రభుత్వం పేదలు, మధ్య తరగతి వారికి చేరువ చేసేందుకు సిద్ధమైంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విద్యాబోధనను ప్రవేశపెట్టేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, మౌలిక వసతులు కల్పించి ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’కార్యక్రమాన్ని అమలు చేయాలని సంకల్పించింది. తద్వారా పేదింటి పిల్లలకు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నంతో పేద కుటుంబాల పిల్లలకు బంగారు భవిష్యత్తు లభించనుంది. ఇప్పటికే ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం,ఉచితంగా పాఠ్య పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు, కాస్మోటిక్ చార్జీలు అందజేస్తున్నది.
సిద్దిపేట, జనవరి 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మెదక్ మున్సిపాలిటీ : ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త హంగులను సంతరించుకోనున్నాయి. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్ర వేశపెట్టాలని నిర్ణయించింది. విద్యార్థుల్లో నూతనోత్తేజం పెం చి నాణ్యమైన విద్యను అందించేందుకు కసరత్తు చేస్తున్నది. రెండు రోజుల కిందట రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనుంది. దీంట్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల ను మరింతగా అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున నిధులు మం జూరు చేసింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యబోధన, మెరుగైన వసతుల కల్పన కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ. 7,289 కోట్లను వెచ్చించాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇక నుంచి ఆంగ్ల మధ్యమంలో విద్యాబోధన చేపట్టనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఇటీవలే ఉపాధ్యాయుల బదిలీలు ప్రభుత్వం చేపట్టింది. అన్ని పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించింది. జీవో 317 ద్వారా ప్రతి పాఠశాలకు ఉపాధ్యాయుల కేటాయింపు పూర్తిచేసింది. ఎన్నో ఏండ్లుగా ఉపాధ్యాయులు లేక విద్యా వలంటీర్లతో నె ట్టుకొస్తున్న పాఠశాలలకు ప్రస్తుతం టీచర్ల కొరత తీరింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను ప్రభు త్వం కేటాయించింది. ఇంకా ఖాళీలు ఉంటే కొత్త జోన్ల ప్రకారం స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
సర్కారు బడులకు మహర్దశ
రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మనబడి’ కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నది. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంతో ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు సత్తాచాటనున్నాయి. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారీతిగా ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులపై భారాన్ని మోపాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగనున్నాయి.
సమైక్య రాష్ట్రంలో సర్కారు బడులు నిర్వీర్యం…
సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కార్పొరేట్ పాఠశాలకు పెద్దపీట వేసి ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేశాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం కేసీఆర్ సంస్కరణలు అమలు చేసి గాడిన పడేలా చేశారు. మధ్యాహ్న భోజనంతో పాటు విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, రెండు జతల దుస్తులు అందిస్తున్నారు. బాలికల కోసం హైజనిక్ కిట్స్ను ప్రభుత్వం అందిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించింది. దీంతో మూడేండ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది. కరోనా తర్వాత అడ్మిషన్ల సంఖ్య బాగా పెరిగింది.
ప్రభుత్వ బడులకు సకల సౌకర్యాలు..
ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త హంగులు సంతరించుకోనున్నాయి. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలను మరింతగా అభివృద్ధి చేయనున్నారు. ప్రతి పాఠశాలలో అవసరమైన తరగతి గదుల నిర్మిస్తారు. మధ్యాహ్న భోజనం కోసం కిచెన్ షెడ్లు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఉన్నాయి. లేనిచోట నిర్మించనున్నారు. ప్రధానంగా ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బాలుర, బాలికల టాయిలెట్స్ను నిర్మిస్తారు. అవసరమైన ఫర్నిచర్, డైనింగ్ హాల్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు తదితర వాటిని ఏర్పాటు చేస్తారు. మొత్తంగా ప్రతి పాఠశాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరిగేలా అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు.గత ప్రభుత్వాల హయాంలో తరగతి గదులు లేక చాలాచోట్ల చెట్ల కిందనే చదువులు కొనసాగాయి. వర్షం కురిస్తే ఆ పాఠశాలలకు సెలవులు ప్రకటించేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ఇబ్బందులను ప్రభుత్వంతొలిగించింది. కొత్తగా తరగతి గదులను నిర్మించింది. ప్రతి పాఠశాలకు ప్రహరీ నిర్మించడంతో పాటు తాగునీటి వసతిని కల్పించింది. హరితహారంలో పాఠశాలల పరిసరాల్లో మొక్కలు పెంచి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది.
ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి..
సిద్దిపేట జిల్లాలో వివిధ కేటగిరీల కింద ఉన్న 1269 పాఠశాలల్లో 1,37,517 మంది విద్యార్థు లు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. తెలు గు మీడియంలో 683 పాఠశాలల్లో 21,338 మంది విద్యనభ్యసిస్తున్నారు. మొత్తం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 972 ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 1239 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం ఆంగ్ల మాధ్య మ పాఠశాలలు 298 కాగా, ప్రాథమిక పాఠశాలలు 212, ప్రాథమికోన్నత 7, ఉన్నత పాఠశాలలు 79 ఉన్నాయి.
మెదక్ జిల్లాలో 924 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా యి. ఇందులో 624 ప్రాథమిక పాఠశాలలు, 129 ఉన్నత పాఠశాలలు, 159 ప్రాథమికోన్నత పాఠశాలలు, అర్బన్ గురుకుల పాఠశాల ఉంది. వీటితో పాటు 11 కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1.10 లక్షల పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటికే 325 పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధన కొనసాగుతున్నది. ఇంగ్లిషు మీడియంలో విద్యాబోధన ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనుంది. తద్వారా వారు ఉన్నత స్థాయికి చేరడానికి అవకాశాలు లభిస్తాయి.
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బ లోపేతానికి విశేషంగా కృషిచేస్తున్నది. దీంతో రెండు మూడేండ్లుగా ప్రైవేట్ పాఠశాలల నుంచి పెద్ద ఎత్తున్న విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారు. ఈ ఏడాది మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 21,736 మంది విద్యార్థులు చేరగా, ఇందులో ప్రైవేట్ పాఠశాలల నుంచి 7,709 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం విశేషం.