చిక్కడపల్లి : మున్సిపల్ జవాన్ల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. బుధవారం చిక్కడపల్లి మున్సిపల్ మార్కెట్ ఆవరణలో జీహెచ్ఎంసీ హెల్త్ శానిటరీ జవాన్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రేటర్ కార్యాలయాన్ని స్థానిక గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్కుమార్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ జవాన్లు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ఉద్యోగబాధ్యతలు నిర్వహించాలన్నారు. వారికి ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తేవాలని పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు. టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో వెల్పేర్ అసోసియేషన్ గ్రేటర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకటయ్య, ప్రేమానందం, మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ, జీహెచ్ఎంసీ బీఎంఎస్ అధ్యక్షుడు శంకర్,జనార్థన్, మల్లేశ్, విజయ్కుమార్, నర్సింగ్ రావు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.