భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, జనవరి 21 : మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, డీఈలు, ప్రజారోగ్యశాఖ ఇంజినీరింగ్ అధికారులు, పారిశుధ్య అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటి నుంచి నూరుశాతం చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగూడెంలో 67 శాతం, ఇల్లెందులో 95 శాతం, పాల్వంచలో 76 శాతం, మణుగూరులో 40 శాతం ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరుగుతున్నట్లు చెప్పారు. కొత్తగూడెంలోని పంచతంత్ర, రాజీవ్ పార్కుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, మొక్కల సంరక్షణ నిరంతరం జరగాలని చెప్పారు. పారిశుధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని, ఈపీఎఫ్ మినహాయింపులు చేయాలని, ఈపీఎఫ్ నెంబర్లు కేటాయించాలని, ఆ వివరాలను రిజిస్టర్లో నమోదులు చేయాలని సూచించారు. ఆన్ ఆర్గనైజ్డ్ సిబ్బంది వివరాలను ఈ శ్రమ పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనుల గురించి మున్సిపల్ కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. పనులను జాప్యం చేసే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని చెప్పారు. క్రీడలను ప్రోత్సహించేందుకు మున్సిపాలిటీల్లో ఇండోర్ షటిల్ కోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాల్వంచలో గ్రంథాలయ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అక్కడి సెంట్రల్ లైటింగ్ పనులను జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్ను రద్దు చేసి మరొక కాంట్రాక్టర్తో పనులు చేయించాలని సూచించారు. ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు సంపత్కుమార్, శ్రీకాంత్, అంజన్కుమార్, నాగప్రసాద్, ప్రజారోగ్య శాఖ డీఈ నవీన్, మున్సిపల్ డీఈలు నవీన్, మురళీ పాల్గొన్నారు.