వ్యవసాయ యూనివర్సిటీ : అత్యంత వెనుకబడిన గిరిజనుల బతుకులో వెలుగు నింపేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని , ప్రధానంగా గిరిజన లాయర్స్, మేధావులపై మరింత బాధ్యత ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళ్సైసౌందర్యరాజన్ అన్నారు.
శుక్రవారం సెంటర్ ఫర్ ప్రాక్టీసింగ్ లా ఇన్ పార్టనర్షిప్ ,నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలఫ్ మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (ఎన్ఐఆర్డిపిఆర్) హైదరాబాద్ ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్ లో జరిగిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ నాడు సమాజానికి దూరంగా ఉన్న గిరిజనులు రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రభుత్వం వారికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలు గా ఏర్పాటు, తండా అభివృద్ధికొరకు ప్రత్యేక నిధులు కేటాయించిందని గుర్తుచేశారు.
రాష్ట్రంలో పోడుభూములు , అటవీ భూముల లెక్కలు తేల్చి గిరిజనులు సాగు చేసే భూములను వారికి అప్పగించేందుకు ప్రణాళిక సిద్దం చేసిందన్నారు. గిరిజనుల బతుకుల్లో మార్పు రావాలంటే ప్రధానంగా చదువు అవసరమన్నారు. ప్రతి చిన్నారిని చదివించేలా వారిని ప్రోత్సహించాలన్నారు.
రాష్ట్రంలో గిరిజనుల నుంచి దాదాపు 200 మంది న్యాయవాది వృత్తి లో కొనసాగుతున్నారని , ఈ సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ కృషిని సార్థకం చేయాలని ఆమె పిలుపు నిచ్చారు.
అంతకు ముందు ఎన్ఐఆర్డిపిఆర్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ ఆధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర నలు మూలల నుంచి 89 మంది గిరిజన లాయర్స్, శాస్త్రవేత్తలు , వివిద శాఖలలో పనిచేస్తున్న గిరిజన మేధావులు పాల్గొన్నారు. ఆయా తండాలనుంచి వచ్చిన గిరిజన మహిళలు వారి కట్టూ బొట్టూ , సంస్కృతులతో ఆటా పాటలతో గౌవర్నర్ తమిళ్సై సౌందర్యరాజన్ను ఘనంగా స్వాగతించారు.
సెంట్రల్ఫర్ లా రాజేశ్వరి తమన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గిరిజనులు ఇప్పటికీ ప్రస్తుత సమాజానికి దూరంగా ఉన్నారన్నారు.అక్కడక్కడ కొందరు చైతన్యం అయినప్పటీకీ వారి సంఖ్య పెరగాలన్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో విద్య, వైద్యం, వారికి దరి చేరడం లేవన్నారు.
తెలంగాణలో గిరిజనుల ఎదుగుదలకు మంచి అవకాశాలున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు పరుస్తుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఒడిస్సా సబ్ కలెక్టర్ డా.శుభాంకర్మాపాత్ర, ఎడి సురేష్ ,తదితరులు పాల్గొన్నారు.