రవీంద్రభారతి : తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ నృత్యోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29 శుక్రవారం మద్యాహ్నం 1.30 నుండి రాత్రి 9 గంటల వరకు రవీంద్రభారతి మొయిన్హాల్లో నృత్యోత్సవం -2022 పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సంగీత నాటక అకాడమీ కార్యదర్శి జి. వసుంధర తెలిపారు.
గురువారం ఆమె రవీంద్రభారతిలోని తెలంగాణ సంగీత నాటక అకాడమీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మరుగున పడిపోతున్న శాస్త్రీయ కళలను పరిరక్షించుకునేందుకు గాను అంతర్జాతీయ నృత్యోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ శాస్త్రీయ కళాశాలలకు చెందిన నాట్యగురువులు, విద్యార్థులచే కూచిపూడి, భరతనాట్యం, పేరిణి నృత్యాల ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు.
నృత్య కళ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, నృత్య విద్యను ప్రోత్సహించడం అంతర్జాతీయ నృత్య దినోత్సవ ముఖ్య ఉద్ధేశమన్నారు.తెలంగాణ ప్రభుత్వం భారతీయ సంగీత నాటక అకాడమీ, శాస్త్రీయ నృత్యాలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ప్రదర్శింప చేసే ప్రయత్నమే ఈ నృత్యోత్సవం అన్నారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కవులను, కళాకారులను, కళలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని, నాట్యగురువులు శాస్త్రీయ కళల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని ఆమె సూచించారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఎంతో తోడ్పాటునందిస్తుందని ఆమె చెప్పారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాసగౌడ్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి. రమణాచారి రానున్నట్లు ఆమె తెలిపారు.