కరోనా-ఒమిక్రాన్ను ఎదుర్కోవడానికి అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ప్రభుత్వ దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కరోనాను ఎదుర్కోవడానికి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సర్వ సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కరోనా టెస్టింగ్ కిట్లు, హోం ఐసొలేషన్ కిట్లు , మందులు, బెడ్లు, ఆక్సిజన్, ఐసీయూ వంటి సౌకర్యాలతో దవాఖానలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రజలు భయాందోళన చెందవద్దని, జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అందరూ కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని, టీకా తీసుకోవాలని కోరారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ సంక్షేమ పథకాలు ఆపకుండా అమలు చేస్తున్నామన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకే గ్రామాల రూపురేఖలు మారినట్లు తెలిపారు.
గజ్వేల్, జనవరి 19 : కరోనా-ఒమిక్రాన్ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా సిద్ధంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ప్రభుత్వ దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనాను ఎదుర్కోవడానికి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసొలేషన్ కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. అన్ని ఏఎన్ఎం సెంటర్లు, పీహెచ్సీలు, అన్ని దవాఖానల్లో కరోనా టెస్టింగ్ కిట్లు, హోం ఐసొలేషన్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో బెడ్లు, ఆక్సిజన్, ఐసీయూ వంటి సౌకర్యాలతో సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సిద్దిపేట మెడికల్ కళాశాలలో 100 పడకలతో కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేశామన్నారు. ప్రజలంతా తప్పనిసరిగా మాస్కు ధరించాలని, వ్యాక్సిన్ వేసుకోవాలని మంత్రి కోరారు. మొదటిడోసు పంపిణీ వందశాతం పూర్తయ్యిందని, రెండో డోసు మరో 25శాతం చేయాల్సి ఉందన్నారు. 60 ఏండ్లు పూర్తయిన వారంతా బూస్టర్ డోసు వేసుకోవాలన్నారు. 15 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ రెండు డోసులు వేసుకోవాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారంతా మందులు బాగా వాడాలన్నారు. కొందరిలో వ్యాధి లక్షణాలు కనబడడం లేదని, మరికొందరిలో లక్షణాలు కనబడుతున్నాయన్నారు. లక్షణాలు కనబడిన వారంతా తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొవడానికి వైద్య ఆరోగ్యశాఖ సంసిద్ధంగా ఉందని, ప్రజలు కూడా ఇందుకు సహకరించాలని మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు.
దవాఖానలో అణువణువు తిరుగుతూ..
బుధవారం గజ్వేల్లోని ప్రభుత్వ జిల్లా దవాఖానను తనిఖీ చేసిన మంత్రి హరీశ్రావు, దవాఖానలోని అణువణువునూ క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా అత్యవసర వైద్య సేవల విభాగాన్ని పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న వైద్యుడు, అక్కడి సిబ్బంది వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అత్యవసర విభాగంలో ఈసీజీని పరిశీలించారు. అనంతరం డయాగ్నోస్టిక్ సేవల విభాగానికి వెళ్లి అక్కడ వైద్యసేవల కోసం వచ్చిన రోగులతో మాట్లాడారు. దవాఖాన సూపరిండెంట్ డాక్టర్ మహేశ్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం దవాఖాన వెనక భాగంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలను పరిశీలించారు. పరీక్ష చేయించుకున్న వారిని హోం ఐసొలేషన్ కిట్ల పంపిణీ, రిపోర్టులపై ఆరాతీశారు.
సాధారణ ప్రసవాలకు కృషిచేయండి ..
వీలైనంత వరకు సాధారణ ప్రసవానికే ప్రయత్నించాలని మంత్రి హరీశ్రావు గజ్వేల్ దవాఖాన వైద్య సిబ్బందికి సూచించారు. గర్భిణుల వైద్య పరీక్షల విభాగాన్ని పరిశీలించిన ఆయన, నెలవారి వైద్య పరీక్షల కోసం వచ్చిన గర్భిణలను ఆప్యాయంగా పలకరించారు. మిడ్వైఫరీ సేవలు, వైద్య సిబ్బంది ద్వారా అందుతున్న సేవల గురించి స్వయంగా వారిని అడిగి తెలుసుకున్నారు. మందులు మంచిగా వాడాలని, బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. గజ్వేల్ దవాఖాన వైద్యులు, సిబ్బంది బాగా పనిచేస్తున్నారని, గజ్వేల్ దవాఖానలోనే నెలకు 400 ప్రసవాలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. కేసీఆర్ కిట్ అమలు తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో 22 శాతం ప్రసవాలు పెరిగాయన్నారు. ముఖ్యంగా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో పుట్టిన పిల్లలకు పచ్చకామెర్ల చికిత్స కోసం ఎస్ఎంసీయూ వార్డులో ఫొటోథెరపీ నిర్వహిస్తూ సిబ్బంది చక్కని సేవలందిస్తున్నారని మంత్రి అభినందించారు.
గుంపులుగా రాకండి…
ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నదని, కాబట్టి కార్యక్రమాలు, సభల వద్దకు గుంపులుగా రావద్దని మంత్రి హరీశ్రావు సూచించారు. కార్యక్రమాలకు హాజరయ్యే వారు తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు వినియోగించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. గజ్వేల్ దవాఖానను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్రావును కవరేజ్ చేయడానికి లోపలికి వెళ్తున్న మీడియా ప్రతినిధులు కూడా లోపలికి గుంపులుగా రావొద్దని మంత్రి సూచించారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ పంగమల్లేశం,‘గడా’ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.