కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో రోజుకు వందకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. మొన్నటి వరకు రెండు, మూడుకు మించని కేసులు ప్రస్తుతం వంద దాటుతున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తమైనప్పటికీ కేసుల నియంత్రణకు ప్రజలు సైతం జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చెక్పోస్టుల వద్ద కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నది.
కామారెడ్డి/ ఖలీల్వాడి, జనవరి 16: ఉమ్మడి జిల్లాలో కొన్నిరోజులుగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి కట్టడికి అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో కొవిడ్, ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కట్టడి కోసం సరిహద్దులో చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు సరిహద్దున కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలం సలాబత్పూర్ , నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లోని సాలురా చెక్పోస్టు వద్ద ప్రత్యేక నిఘా పెంచారు. ఇక్కడ డాక్టర్, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వస్తే వారి వివరాలను నమోదు చేసి వారిని వెంటనే తిరిగి సొంతూరుకు పంపిస్తున్నారు. మందులు అందించి హోం క్వారంటైన్లో ఉండాలని సూచిస్తున్నారు. వారం రోజులుగా జుక్కల్, మద్నూర్, పెద్ద కొడప్గల్ మండలాలకు వచ్చే వారిపై నిఘా పెంచారు. కర్ణాటక నుంచి నారాయణ్ఖేడ్, కంగ్టీ మీదుగా కామారెడ్డి జిల్లాకు వచ్చేవారిపై ప్రత్యేక దృష్టి సారించారు. కర్ణాటక నుంచి ఔరద్ తదితర ప్రాంతాల నుంచి జుక్కల్ మండలం హనేగాం, పిట్లం, నిజాంసాగర్ మీదుగా కామారెడ్డి జిల్లాకు వచ్చేందుకు మార్గాలు ఉన్నాయి. అయితే ఈ మార్గాల్లో పరీక్షలు నిర్వహించడంలేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చెక్పోస్టుల వద్ద తనిఖీలు, పరీక్షలను కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు జితేశ్ వీ పాటిల్, నారాయణరెడ్డి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
చెక్ పోస్టుల వద్ద పరీక్షలు
తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో బస్సులు, కార్లు, లారీలు,ఆటోలు, జీపులు, బైకులను ఆపి కచ్చితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కానీ పోలీసు సిబ్బంది లేకపోవడంతో వైద్య సిబ్బంది కేవలం ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లను ఆపి పరీక్షలు నిర్వహిస్తున్నారు. తనిఖీలు ముమ్మరం చేయాలంటే పోలీసుల భద్రత పెంచాలని వైద్య సిబ్బంది కోరుతున్నారు. సంగారెడ్డి-మద్నూర్-నాందెడ్ మీదుగా వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.సలాబత్పూర్ చెక్పోస్టు వద్ద ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు నమోదుకాలేదని కామారెడ్డి డీఎంహెచ్వో కల్పనా కాంటే తెలిపారు.
అందుబాటులో ఆక్సిజన్
కరోనా నేపథ్యంలో కలెక్టర్లు నారాయణరెడ్డి, జితేశ్ వీ పాటిల్, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు ఇప్పటికే సమావేశాలు నిర్వహించి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆక్సిజన్ అందుబాటులో ఉంచేలా అన్ని ప్రభుత్వ దవాఖానలకు ఆదేశాలు జారీ చేశారు. అధికారుల సూచనల మేరకు నిజామాబాద్ జిల్లా దవాఖానలోని ఏడో అంతస్తులో కరోనా పేషెంట్ల కోసం ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లా ప్రభుత్వ దవాఖానలో 521 బెడ్లు ఉండగా 44 మంది చికిత్స పొందుతున్నారు. బోధన్లో 100 బెడ్లు ఉండగా ఒకరు చికిత్స పొందుతున్నారు. ఆర్మూర్లో 130 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. దవాఖానల్లో కొవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు.