గోల్నాక : వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు కొత్త అభివృద్ధి పనులను ప్రణాళికా బద్ధంగా వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
సోమవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో ఆయన విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాగ్అంబర్పేట డివిజన్ మొయిన్చెర్వు హిందూ స్మశాన వాటిక, గోల్నాక డివిజన్ హిందూ స్మశాన వాటికల ఆధునీకరణ పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు.
స్మశాన వాటికలో పార్కింగ్, ఎలక్టిక్ బర్నర్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆయన సూచించారు. దీంతో పాటు అంబర్పేట, బాగ్అంబర్పేట, గోల్నాక, నల్లకుంట, కాచిగూడ డివిజన్లలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు.
రహదారుల నిర్మాణానికి అనుమతులు లభించిన వెంటనే అంచనా వ్యయాన్ని సిద్ధం చేసి ఆలస్యం చేయకుండా బిల్లులు పంపించి పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అంతే కాకుండా రహదారుల ఏర్పాటులో ప్రజలకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇక భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్ల వ్యవస్థను ఆధునీకరించాలన్నారు. ప్రస్తుతం మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఇందుకు సంబంధించి కొత్త పైప్లైన్ల ఏర్పాటు కోసం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న వరదనీటి పైప్లైన్లు, మంచినీటి పైప్లైన్లు, డ్రైనేజీ పైప్లైన్ల పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు అంచనాలు రూపొందించాలన్నారు. మంచినీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తూ కలుషిత మంచినీటి సమస్యతో పాటు లోఫ్రెషర్ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన చౌరస్తాలు, పార్కులు, ఆట స్థలాలను గుర్తించి వాటి అభివృద్ధి కొరకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఎక్కడైనా అనుమతులు లేదా ఇతర సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.
నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ దిశానిర్ధేశం చేశారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ అధికారులు శంకర్, సుధాకర్, సువర్ణ, ఫరీద్, ప్రేరణ, రవి, నరేందర్, దుర్గా, సంపత్, జలమండలి అధికారులు రోహిత్, మాజిద్, బాలకృష తదితరులు పాల్గొన్నారు.