గోల్నాక : అంబర్పేట ఛే నంబరు చౌరస్తా ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరిం చడంతో పాటు భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్న రహదారి విస్తరణకు వ్యాపారులు సహకరించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు.
రోడ్డు విస్తరణ నేపథ్యంలో వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం అలీకేఫ్ చౌరస్తా నుంచి నాగోల్ వెళ్లే రహదారి విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. రోడ్డు విస్తరణలో భాగంగా భూ నిర్వాసితులు, పలు దుకాణాల వ్యాపారులతో ఆయన సమావేశమయ్యారు.
రోడ్డు విస్తరణలో భాగంగా తమ దుకాణాలను తొలగిస్తే తాము ఉపాధి కోల్పోతామని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పూర్తి నష్టం కలుగకుండా నివారించే అవకాశాలను పరిశీలించాలని వ్యాపారులు మొర పెట్టకున్నా రు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నష్టపరిహారంతో పాటు తగిన న్యాయం చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ..ఛే నంబరు ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా ట్రాఫిక్ను మళ్లించేందుకు ముందుగా అలీకేఫ్ చౌరస్తా నుంచి నాగోల్ వరకు 120 ఫీట్ల వెడల్పులో రహదారి విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు. రహదారి విస్తరణ పూర్తి అయితే దూర భారం తగ్గనుందన్నారు.
దీంతో ప్రధాన ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.రహదారి విస్తరణకు వ్యాపారులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యాపారులు సుధాకర్, పాష, ప్రశాంత్, శేఖర్, మల్లేశం, పావని, అహ్మద్, షఖీల్, ప్రవీణ్, సురేష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.