జిల్లాలో వానకాలం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. విత్తన పంట, రైతులు సొంత అవసరాలకు దాచుకున్న ధాన్యం మినహాయిస్తే..రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు 2.74లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది.ఈ మేరకు సర్కారు ప్రతి గింజనూ కొనుగోలు చేసింది. జిల్లా వ్యాప్తంగా 275 కేంద్రాలను ఏర్పాటు చేయగా కొనుగోళ్లు పూర్తి కావడంతో ఇప్పుడు వాటన్నింటినీ మూసి వేశారు. ఇప్పటివరకు రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో రూ.340 కోట్ల ధాన్యం డబ్బులు జమ అవ్వడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కొరవడ్డప్పటికీ అధికారులు, మిల్లర్లు సమన్వయంతో వ్యవహరించడంతో సేకరించిన ధాన్యంలో 2.68లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మిల్లులకు తరలించారు.
యాదాద్రి భువనగిరి, జనవరి16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈసారి కూడా వానకాలంలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. పౌరసరఫరాల శాఖ, ఐకేపీ, పీఏసీఎస్, వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా అంచనాలకు అనుగుణంగా ధాన్యం సేకరించారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలన్న సర్కారు లక్ష్యానికి అనుగుణంగా రూ.517 కోట్ల విలువ గల 2,74,326 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. జిల్లాలో మూసీతోపాటు గోదావరి జలాలు అందుబాటులోకి రావడం.. సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రతి యేటా సాగుతో పాటు దిగుబడులు సైతం పెరుగుతూ వస్తుండగా..రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ధాన్యం సేకరణ జరుపుతున్నది.
రూ. 517 కోట్ల విలువ గల ధాన్యం కొనుగోళ్లు
జిల్లాలో సాగుకు అనుకూల పరిస్థితుల నేపథ్యంలో ఈసారి వానకాలం సైతం పంట పుష్కలంగా పండింది. కేంద్రం కొర్రీలు పెట్టినప్పటికీ..రైతులను ఆదుకోవాలన్న ఏకైక లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగింది. జిల్లా వ్యాప్తంగా వానకాలంలో కొనుగోలు కేంద్రాలకు 3 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేసుకున్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేసి సజావుగా ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టింది. కొనుగోళ్లు, మార్కెటింగ్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతోపాటు సరిపడా గన్నీ బ్యాగులను సైతం అధికారులు అందుబాటులో ఉంచారు. ఫలితంగా అనుకున్న గడువులోగా రూ.517కోట్ల విలువ గల ధాన్యాన్ని కొనుగోలు చేయగలిగారు.
సంక్షోభ పరిస్థితుల్లోనూ.. అండగా నిలిచిన ప్రభుత్వం
రెండేండ్లుగా ప్రభుత్వం గ్రామాల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తూ వస్తున్నది. కరోనా పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతాంగానికి పల్లెల్లోనే ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం కొండంత ధైర్యాన్నిచ్చింది. ఈసారి వానకాలంలో జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో 91, పీఏసీఎస్ 180, మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో 4 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనబోమని స్పష్టం చేసి రైతులను ఇరకాటంలో పెట్టినప్పటికీ రైతు పక్షపాతిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజనూ కొనుగోలు చేసింది. సంక్షోభ పరిస్థితుల్లోనూ మద్దతు ధర చెల్లించి జిల్లా రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలవడంతో రైతు కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది.
విజయవంతంగా కొనుగోళ్లు
రెండు నెలల వ్యవధిలోనే మొత్తం ధాన్యంవిజయవంతంగా కొనుగోలు చేశాం. వానకాలంలో రూ.517 కోట్ల విలువ గల ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు ఇప్పటివరకు రూ.340 కోట్లమేర చెల్లింపులు కూడా పూర్తయ్యాయి. మిగిలిన చెల్లింపులు త్వరగా చెల్లించే ఏర్పాట్లలో ఉన్నాం.
-గోపి కృష్ణ, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్,
యాదాద్రి భువనగిరి జిల్లా