మియాపూర్ : కులమతాలకు అతీతంగా అందరికీ సమాన ప్రాధాన్యతనిస్తూ ఆదరిస్తూ బహుమతులను అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ ఒక్కడేనని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ ఇలా అన్ని మతాలకు సంబంధించిన పండుగల సందర్భంలో తండ్రిలా బహుమతులతో ప్రోత్సహిస్తున్నారన్నారు.
ఈ గొప్ప సంప్రదాయాన్ని దేశంలోనే తొలిసారిగా అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని శుక్రవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషీగూడ పుల్ గాస్పెల్ చర్చీలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్తో కలసి విప్ ఆరెకపూడి గాంధీ కైస్తవులకు బట్టలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలంతా తమ తమ పండుగలకు కొత్త బట్టలతో సంతోషంగా చేసుకోవాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ కానుకలను అందిస్తున్నారన్నారు. అన్ని వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసి నిధులను కేటాయించి వారి ఎదుగుదలకు బంగారు బాటలు వేస్తున్నారన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంబానికి అందించేందుకు తాను చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 45 మంది పాస్టర్లకు బట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో పార్టీ నేతలు అనీల్, గణేశ్, కాశీ, శ్రీనివాస్, రాజేశ్,మోజెస్, వెంకట్, రాజ్యలక్ష్మీ, మధులత, యాదగిరి, రాములు తదితరులు పాల్గొన్నారు.