ఎల్లారెడ్డి రూరల్, జనవరి 19:‘పిట్ట కొంచెం..కూత ఘనం’అన్న చందంగా చిన్నారులు తమ నృత్య రూపకాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రశంసలు పొందుతున్నారు. అయ్యప్ప పడిపూజా కార్యక్రమాల్లో ఎల్లారెడ్డి పట్టణానికి చెంది న చిన్నారుల బృందం రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఏటా కార్తీకమాసంలో అయ్యప్ప స్వామి దీక్షలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా అయ్యప్ప స్వామి పడిపూజ అంటే భక్తుల్లో ఒక విధమైన క్రేజ్ ఉంది. మామూలు పూజా కార్యక్రమలకు భిన్నంగా అయ్యప్పస్వామి పడిపూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. అయ్యప్పస్వామికి వివిధ అభిషేకాలు, పద్దెనిమిది మెట్లకు చేసే పూజతోపాటు భజనలు చేసే భక్తులు, ఆర్కెస్ట్రాలు పూజలో ప్రధాన భాగంగా ఉంటాయి. అయ్యప్పస్వామి పాటలు మంచి జోష్తో, జానపదగేయాల మాదిరిగా ఉండడంతో భక్తులు పాటల్లో లీనమైపోవడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. అయితే ఈ సంవత్సరం ఎల్లారెడ్డి పట్టణంతోపాటు పలు జిల్లాల్లో ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన చిన్నారుల బృందం అయ్యప్పస్వామి నృత్యరూపకాలను, పాటలపై నృత్యప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందింది. ఎల్లారెడ్డి మాజీ ఎంపీపీ, గురుస్వామి నునుగొండ శ్రీనివాస్ ప్రోత్సాహంతో, పట్టణానికి చెందిన డ్యాన్స్మాస్టర్ చక్రపాణి ఆధ్వర్యంలో సాహితీ పల్లవి, మహాలక్ష్మి, సాయి తనిక్ష, శ్రీవిద్య, గాయత్రి, శ్రీవాణి, నక్షత్ర, సాయి వరుణ్ అనే చిన్నారులు శిక్షణ పొంది పడిపూజల్లో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పడిపూజలంటేనే ఆదరించి కార్యక్రమాలకు హాజరయ్యే భక్తులకు, ఈ సంవత్సరం చిన్నారుల ప్రదర్శనలు కనువిందు చేశాయి. ఎల్లారెడ్డిలో నిర్వహించిన మండల మహాపూజలో నృత్యరూపకాలు, అయ్యప్ప పాటలపై నృత్య ప్రదర్శనలు ప్రారంభించిన చిన్నారుల బృందానికి ఎక్కడాలేని ప్రోత్సాహం లభించింది. ఎల్లారెడ్డితోనే వారి ప్రదర్శనలు ఆగకుండా రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు చెందిన భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి నిర్వహించిన పడిపూజా కార్యక్రమంలో చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పలువురి ప్రశంసలతోపాటు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ సైతం చిన్నారులను అభినందించారు.