బంజారాహిల్స్ : మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన నిందితులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు.
ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని రెయిన్ బో ఆస్పత్రి ఎదురుగా కారు ప్రమాదంలో రోడ్డు దాటుతున్న ఆయోద్య రాయ్, దేవేందర్ కుమార్ దాస్ అనే ఇద్దరు యువకులు దుర్మరణం పాలయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణమైన ఉప్పల్లోని రాఘవేంద్ర కాలనీకి చెందిన బజార్ రోహిత్గౌడ్, కర్మన్ఘాట్కు చెందిన సాయి సోమన్లపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు వారిని సోమవారం కోర్టులో హాజరుపర్చారు.
నిందితులకు 14రోజుల పాటు రిమాండ్ విదించారు. కాగా కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉన్నందున నిందితులను మూడు రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తప్పించుకునేందుకు దారులు అన్వేషించి ..
స్నేహితులతో కలిసి మాదాపూర్లోని పబ్లో పార్టీలో పాల్గొన్న రోహిత్ గౌడ్, సాయిసోమన్లు జూబ్లీహిల్స్,. బంజారా హిల్స్లోని పబ్స్లో అర్థరాత్రి 12.45 దాకా మద్యం సేవించినట్లు పోలీసుల విచారణలో తేలింది. రాత్రి 1.15 ప్రాంతంలో బంజారాహిల్స్లో యాక్సిడెంట్ చేసిన నిందితులు అక్కడినుంచి నేరుగా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మీదుగా రోడ్ నెం 5కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
బంజారాహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోగానే కారును సెల్లార్లో పార్క్ చేసి మరో కారులో ఉడాయిం చేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొంతమంది స్నేహితులకు ఫోన్లు చేయగా ఉమెన్ కో అపరేటివ్ సొసైటీలో నివాసం ఉంటున్న ఓ స్నేహితుడు తన ఇంటి సెల్లార్లో కారు పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది.
అతడి సూచనల మేరకు వెళ్లిన రోహిత్ గౌడ్, సాయిసోమన్లు సెల్లార్లో కారు పార్క్ చేయడం, బీఎమ్డబ్ల్యూ కారులో పారిపోయేందుకు ప్రయత్నించడం చకచకా జరిగిపోయాయి. ఈలోగానే జూబ్లీహిల్స్ పెట్రోలింగ్ సిబ్బందికి అనుమానం వచ్చి వారిని అనుసరించడంతో పారిపోవాలనుకున్న రోహిత్గౌడ్ ప్రయత్నాలు విఫలమయ్యాయి.
పెట్రోలింగ్ పోలీసులు తనను అడ్డుకుని ప్రమాదం గురించి వాకబు చేసినప్పుడు కూడా రోహిత్గౌడ్ కారు నడిపింది తాను కాదంటూ బుకాయించేందుకు ప్రయత్నించడం గమనార్హం. అయితే డ్రైవర్ పేరు ఇతర వివరాలు చెప్పాలంటూ పెట్రోలింగ్ పోలీసులు గట్టిగా పట్టుబట్టే సరికి రోహిత్గౌడ్ కంగారుపడిపోయి అసలు నిజాన్ని చెప్పేశాడు. దాంతో ఈ విషయాన్ని గురించి బంజారాహిల్స్ పోలీసులకు చెప్పడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పెట్రోలింగ్ సిబ్బందికి ఎసీపీ సుదర్శన్ అభినందనలు
బంజారాహిల్స్ : బంజారాహిల్స్లో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంతో వ్యవహరించిన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చెందిన బ్లూ కోల్ట్స్ పోలీసులు సతీష్, జితేందర్లను బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు.
సంఘటన జరిగిన వెంటనే పారిపోయేందుకు ప్రయత్నించిన రోహిత్ గౌడ్, సాయి సోమన్లపై అనుమానం వచ్చి వెంబడించి పట్టుకోవడంపై ప్రశంసలు కురిపించారు. ఇదే స్పూర్తితో పోలీసులు వ్యవహరించాలని సూచించారు.