ఐనవోలు, జనవరి 13: మల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వజారోహణంతో మొదలయ్యాయి. ముందుగా స్వామి వారికి ఒగ్గుపూజరులు మేలుకొలుపు చేశారు. శైవాగమ పద్ధతిలో అర్చకులు ప్రాత:కాలంలో మల్లన్నకు విఘ్నేశ్వరపూజ, రుద్రాభిషేకం చేసి, నూతన వస్ర్తాలతో అలంకరిం చారు. ఉదయం గణపతి పూజ, శైవశుద్ధి పుణ్యాహవాచనం నిర్వహించారు. ఉత్సవ ప్రారంభ సూచికగా ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ కాషాయ పతాకాలను చేబట్టి మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆలయ శిఖరం, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి గుడిపై ఎగురవేశారు. అనంతరం మహాన్యాపూర్వక రుద్రాభిషే కం, మహానివేదన నీరాజన మంత్రపు ష్పం, తీర్థప్రసాద వితరణ చేసి ఉత్సవాలను ప్రారంభమైనట్లు ప్రకటించారు. సాయంత్రం నుంచి భక్తులు తరలివస్తున్నారు. బోనాలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. కార్యక్రమంలో ఈవో నాగేశ్వర్రావు, ఆలయ చైర్మన్ మునిగాల సంపత్కుమార్, డైరెక్టర్లు రాజు, వెంకట్రెడ్డి, సతీశ్, దేవేంద్ర, సంపత్, రాజు, ఆనందం, ప్రతాప్, యుగేంధర్, కుమారస్వామి, సుధీర్, శారద, ఉప్పలయ్య, వేద పండితులు పురుషోత్తమ శర్మ, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్శర్మ, అర్చకులు నందనం మధుశర్మ, పాతర్లపాటి నరేశ్శర్మ, నందనం భానుప్రసాద్, ఉప్పుల శ్రీనివాస్, ఆలయ సిబ్బంది కిరణ్, మధుకర్, శ్రీకాంత్, రాజు పాల్గొన్నారు.
నేడు భోగి పండుగ ప్రత్యేక పూజలు
భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం స్వామి వారికి మేలుకొలుపుతో పూజలు ప్రారంభమవుతాయి. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, మహాన్యాసపూర్వక ఏకాదశి, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మంత్ర పుష్పాల పూజలు జరుగనున్నాయి. స్వామివారి దర్శనం 24 గంటల పాటు కొనసాగనుంది.