ఖిల్లాఘణపురం, ఏప్రిల్ 4: ప్రతి గ్రామంలో పర్యటించి బీజేపీ ప్రభుత్వం బండారాన్ని బయటపెడుతామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. దేశంలోని రైతులను బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నదన్నారు. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి పిలుపు మేరకు మండలకేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి మంత్రి నిరంజన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుల అభ్యున్నతికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ఉచిత విద్యుత్, సాగునీరు పుష్కలంగా అందించి బీడుభూములను సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటారన్నారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం రైతులు, కార్మికులను ఇబ్బందులు పెట్టి కొంతమంది వ్యక్తులకు మాత్రమే కొమ్ము కాస్తూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులపై అవలంబిస్తున్న ధ్వంద వైఖరిని వీడి ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. దేశానికి వెన్నెముకైన రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తున్నదన్నారు. ప్రతి రైతు ఇంటిపై నల్ల జెండాలు కట్టి నిరసన వ్యక్తం చేయాలన్నారు. ఈ నెల 11లోపు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షకు నిరసనగా మరో ఉద్యమానికి నాంది పలుకుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సామ్యానాయక్, సర్పంచ్ వెంకటరమణ, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, సింగిల్విండో అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రాళ్లకృష్ణయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్(మూసాపేట), ఏప్రిల్ 4: దేశంలోనే ఎక్కువ మొత్తంలో వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టిస్తే రైతులను అభినందించాల్సిందిపోయి వరి కొనమని మోదీ మొండికేయడం సిగ్గుచేటని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసాపేట మండలకేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు కష్టపడి ధాన్యాన్ని పండిస్తే కొనకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. వ్యవసాయంపై అవగాహన లేని పీయూష్ గోయల్ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా ఉండడం దురదృష్టకరమన్నారు. సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా ఒక్క రూపాయి లేకున్నా మా పథకాలని చెప్పకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్లోకి తేవడం, కొత్త ప్రాజెక్టులను మంజూరు చేస్తే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు కేసులు వేసి ఆపడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన బుడ్డర్ఖాన్ కేసీఆర్ను విమర్శించడం సరికాదని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు ల పక్షాన టీఆర్ఎస్ పార్టీయే ఉంటుందని, ఇందుకో సం సీఎం కేసీఆర్ ఢిల్లీలో దీక్షకు పూనుకోవడం దేశ చరిత్రలోనే మొదటిసారి అన్నారు. 6వ తేదీన భూత్పూర్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, సింగిల్విండో అధ్యక్షుడు వెంకటేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు భాస్కర్గౌడ్, సర్పంచులు శ్రీకాంత్రెడ్డి, శివశంకర్, నాయకులు శివరాములు, బగ్గి కృష్ణయ్య, రవీందర్గౌడ్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.